నా వాణికి అవకాశమివ్వండి: హైకోర్టులో జగన్ పిటిషన్
అండర్ ట్రయల్గా ఉన్నా తనకు మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. జైళ్ళ శాఖ డిజి, ఐజి, డిఐజిలను జగన్ తన పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారానికి అనుమతివ్వాలని కోరారు. కాగా అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ గత నెల 27న తేదిన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 28వ తేదిన అతనిని నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపర్చింది.
కోర్టు జగన్కు పదకొండవ తేది వరకు రిమాండ్ విధించింది. జగన్ బెయిల్ కోసం, సిబిఐ కస్టడీ కోసం కోర్టును ఆశ్రయించారు. జగన్ బెయిల్ పిటిషన్ కొట్టి వేసిన కోర్టు.. సిబిఐ కస్టడీకి అతనిని ఐదు రోజుల పాటు అప్పగించింది. సిబిఐ ఆదివారం నుండి అతనిని విచారిస్తోంది. బుధవారం నాలుగో రోజు. గురువారంతో జగన్ కస్టడీ ముగుస్తోంది. సిబిఐ మళ్లీ ఆయన కస్టడీని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది.
మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడి) రంగంలోకి దిగింది. జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టులో సిబిఐ దాఖలు చేసిన రెండో, మూడో ఛార్జీషీట్లు, ఎమ్మార్ ఛార్జీషీట్లు ఇవ్వాలని కోరింది. ఈడి పిటిషన్ స్వీకరించిన నాంపల్లి కోర్టు సిబిఐకి నోటీసులు జారీ చేసింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.
కాగా తాను తిరుపతి, షిర్డీ వెళ్లేందుకు ఆరు రోజుల పాటు అనుమతి ఇవ్వాలని కోరుతూ జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి బుధవారం ఉదయం నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయ సాయి రెడ్డికి బెయిల్ ఇచ్చిన సమయంలో హైదరాబాదు విడిచి వెళ్లరాదని కోర్టు షరతు విధించిన విషయం తెలిసిందే.