గాలి డీల్: చలపతిరావు, పట్టాభి కుమారుడు అరెస్టు
పట్టాభి రామారావు కుమారుడు రవిచంద్రను కూడా ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరగవచ్చునని అంటున్నారు. గాలి బెయిల్ డీల్లో చలపతి రావు కీలక పాత్ర పోషించాడని ఎసిబి డిజి ప్రసాద రావు చెప్పారు. చలపతిరావు అరెస్టును ప్రకటించడానికి ముందు విచారణలో భాగంగా రవిచంద్రను అశోక్నగర్ కార్పోరేషన్ బ్యాంకుకు తీసుకెళ్లారు. మరోవైపు పట్టాభి, అతని సోదరుడి నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.
పట్టాభి ఇంట్లో పలు కీలక డాక్యుమెంట్లు, బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏ క్షణమైనా పట్టాభి రామారావును అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇదివరకే పట్టాభి, అతని కుమారుడిపై సిబిఐ ఎఫ్ఐఆర్ జారీ చేసింది. గాలికి బెయిల్ ఇచ్చేందుకు పట్టాభి రూ.10 కోట్లు అడిగినట్లు తెలుస్తోంది.
పెద్ద మొత్తంలో డబ్బులు అందిన తర్వాతే గాలికి పట్టాభి రామారావు బెయిల్ మంజూరు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి మరోవైపు ఈ స్కాంలో కర్ణాటకకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ డీల్లో ఉన్నట్లు తెలియడంతో వారికోసం ఏసీబీ బృందం బళ్లారికి వెళ్లినట్లు తెలుస్తోంది. గుంటూరులోని రిటైర్డ్ న్యాయమూర్తి చలపతి రావు సోదరుడు శ్రీనివాస రావు నివాసంలో కూడా ఎసిబి సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. చిలకలూరిపేటలో ఆయన బంధవుల నివాసాల్లో కూడా తనిఖీలు జరుగుతున్నట్లు చెబుతున్నారు.
బెయిల్ డీల్లో పాలు పంచుకున్నారని ఆరోపణలు ఎదుర్కుంటున్న గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర రెడ్డి, బంధువు దశరథ రెడ్డి, రౌడీ షీట్ యాదగిరి తదితరుల నివాసాల్లో కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ముడుపులు తీసుకుని గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసినట్లు ఆరోపణలు రావడంతో పట్టాభి రామారావు న్యాయమూర్తి పదవి నుంచి సస్పెండ్ అయ్యారు.