జైల్లో రాత్రంతా క్యాండిల్ వెలుగులో జగన్: జైలుకు ఈడి
జగన్ గదిలో కూడా అధికారులు క్యాండిల్ ఏర్పాటు చేశారు. దీంతో యువనేత రాత్రంతా క్యాండిల్ వెలుగులో నిద్రపోయారట. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఖైదీల లెక్కింపు తదితరాల విషయంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని తెలుస్తోంది. గతంలో ఖైదీల లెక్కింపు మ్యానువల్గా ఉండేది. ఇప్పుడు కంప్యూటరైజ్డ్ అయింది. దీంతో లెక్కింపు సమస్య ప్రహసనంగా మారిందని తెలుస్తోంది. కాగా జైలు అధికారులు, విద్యుత్ అధికారులు ఉదయం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓఎంసి కేసు, ఎమ్మార్ కేసులలో జైలులో ఉన్న నిందితులను విచారించేందుకు ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) అధికారులు గురువారం ఉదయం చంచల్గూడ జైలుకు వెళ్లారు. నిందితులను అధికారులు ఈ రోజు నుండి పదిహేను రోజుల పాటు విచారించనున్నారు. శ్రీలక్ష్మి, బిపి ఆచార్య, శ్రీనివాస్ రెడ్డి, సునీల్ రెడ్డి, విజయ రాఘవ, కోనేరు ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి తదితరులను విచారించనున్నారు.
కాగా జగన్, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డికి నార్కో టెస్టులు జరపాలన్న సిబిఐ పిటిషన్ పైన విచారణను నాంపల్లి ప్రత్యేక కోర్టు వచ్చే నెల 4వ తేదికి వాయిదా వేసింది. జగన్, విజయ సాయి రెడ్డిలను నార్కో టెస్టులకు అనుమతించాలని సిబిఐ ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.