ఇన్ని రోజులకొస్తారా?: లక్ష్మీపేటలో బాబుకు ఝలక్

బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటన జరిగిన పదిరోజులైనా నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే రాష్ట్రం ఎక్కడకు పోతుందనే ఆందోళన కలుగుతోందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మరెవరైనా ఇలాంటి తప్పు చేయాలంటే భయపడేలా శిక్షించాలన్నారు. దళితులపై దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సిఐడితో కాకుండా సిబిఐతో ఈ కేసును విచారింపచేయాలన్నారు. గాయపడిన వారిని ఆదుకోవాలన్నారు. లక్ష్మీపేట ఘటనలో గాయపడి విశాఖ కెజిహెచ్లో చికిత్స పొందుతూ మరణించిన పాపయ్య కుటుంబాన్ని బాబు పరామర్శించారు. దాడి ఘటనపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామని చెప్పారు.
కాగా లక్ష్మీపేటలో చంద్రబాబు పరామర్శిస్తుండగా ఆయనకు చిన్న షాక్ తగిలింది. సంఘటన జరిగిన పదిరోజుల తర్వాత బాబు పరామర్శకు రావడాన్ని దళిత సంఘాలు, మహిళలు కొందరు తప్పు పట్టారు. ఘటన జరిగిన ఇన్ని రోజులకు పరామర్శకు రావడమేమిటని ప్రశ్నించారు.
అంతకుముందు విశాఖపట్నంలో మాట్లాడిన చంద్రబాబు... కోలా కృష్ణమోహన్ చెప్పిన మాటల్లో నిజం లేదని చెప్పారు. సిబిఐ జెడితో విలేకర్లు మాట్లాడటం వారి వృత్తిధర్మంలో భాగమన్నారు. విలేకరులు జెడితో మాట్లాడటాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంపై ఇంకా తాము నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications