జగన్పై ఆటాక్ వల్లే నష్టం: మారిన బాబు పంథా
ఇక నుంచి ప్రజాసమస్యలపై దృష్టి సారించాలని, వైయస్ జగన్పై విమర్శలను తగ్గించాలని తెలుగుదేశం పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే విజయవాడలో ఫ్లై ఓవర్పై చంద్రబాబు ధర్నాకు దిగినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం పార్టీ సీనియర్లు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇన్చార్జ్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ సమస్యలపై విస్తృతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.
కేవలం జగన్ను మాత్రమే లక్ష్యం చేసుకుని ఏడాది పాటుగా చేసిన రాజకీయాల వల్ల పార్టీకి నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం కలగలేదని, మనం జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే అతనికి జనంలో పాపులారిటీ లభించిందని, పలువురు తెలుగుదేశం నాయకులు సమీక్షా సమావేశంలో తమ అభిప్రాయం వెల్లడించారు. ఇక మనం మాట్లాడాల్సింది జగన్ గురించి కాదు, జనం గురించి అని నేతలు సూచించడంతో ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని పార్టీ నిర్ణయించుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఎక్సైజ్ పాలసీ ప్రకారం లాటరీ విధానంతో షాపులు కేటాయించడాన్ని నిరసిస్తూ రాష్టవ్య్రాప్తంగా నిరసన తెలపాలని నిర్ణయించారు. మద్యం విధానాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం రాష్టవ్య్రాప్తంగా అన్ని కలెక్టరేట్ కేంద్రాల్లో వినతిపత్రాలు అందజేస్తారు. 26న మద్యం వేలం కేంద్రాల వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. విత్తనాల కొరత, నకిలీ విత్తనాలు, ఎరువుల ధరల పెంపు, వ్యవసాయ రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ తదితర సమస్యలను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జూన్ 29, 30 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు.
నిరంతరం రైతుల గురించి మాట్లాడడం వల్ల ఏదోఒక రోజు వారు టిడిపికి ఆకర్షితులు అవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్ గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడితే అతన్ని అంతగా తామే పెద్ద నాయకుడిని చేసినట్టు అవుతుందని పలువురు నాయకులు చంద్రబాబు ముందు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.