జగన్ను కలిసేందుకు సంగ్మాకు నో, విజయమ్మతో భేటీ
అనంతరం అక్కడి నుండి నేరుగా లోటస్ పాండులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ వైయస్ విజయమ్మను కలిశారు. ఆమెతో మద్దతు విషయమై చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేస్తున్న సంగ్మా పలు పార్టీల మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇటీవల పది రోజుల క్రితం కూడా ఆయన హైదరాబాద్ వచ్చారు.
అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుతో ఆయన భేటీ అయి, మద్దతును కోరారు. బాబుతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికలలో తనకు మద్దతు ఇవ్వాలని బాబును కోరానని, ఉప ఎన్నికల అనంతరం పార్టీ నేతలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని చెప్పారని సంగ్మా చెప్పారు. సంగ్మా జగన్ పార్టీ నేతలను అప్పుడు కలవలేదు.
అయితే ఆయన వెళ్లాక ఆయన తనయుడు జేమ్స్ సంగ్మా మంగళవారం లోటస్పాండ్లోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఆ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. తాజాగా మరోమారు హైదరాబాద్ వచ్చిన సంగ్మా ఈసారి జగన్ను, విజయమ్మను కలిశారు. యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ జూలై ఒకటిన రాష్ట్రానికి రానున్నారు.
తనను జగన్ను కలవనీయకపోవడంపై సంగ్మా జైలు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ను కలవాలని తాను వారం రోజుల క్రితమే అపాయింటుమెంట్ కోరినట్లు చెప్పారు. జగన్ తన పట్ల వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. అధికారులు తన పట్ల వివక్ష చూపారని, ఎంపి అసదుద్దీన్కు ఓ న్యాయం తనకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.
సంగ్మాకు ములాఖత్ నిరాకరణపై జైలు అధికారులు వివరణ ఇచ్చారు. జగన్తో ములాఖత్లు పూర్తయ్యాయని, రాజకీయాలు మాట్లాడుకునేందుకు అనుమతించమని, జైలు అధికారుల విచక్షణ కింద అనుమతించే ములాఖత్లు మాత్రమే ఉన్నాయని, వాటిని కుటుంబ సభ్యులకు ఇస్తామని స్పష్టం చేశారు.