ఆ మాట సోనియా చెప్పలేదు, ఆ తర్వాతే..: పాల్వాయి
ప్రస్తుత పది జిల్లాలతోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దూకుడుని కాంగ్రెసు పార్టీతో పాటు ప్రభుత్వం కూడా సమర్థంగా ఎదుర్కోలేకపోయిందని ఆయన అన్నారు. అందుకే ఓటమి పాలయ్యామని ఆయన అన్నారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్లో డెడ్ స్టోరేజీ ఉందని, దాని నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడం సరి కాదని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రిని మార్పు చేయడం వల్ల తెలంగాణ విషయంలో ఒరిగేదేమీ ఉండదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ అన్నారు. తెలంగాణవారికి ముఖ్యమంత్రి, మంత్రి పదవులు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని ఆయన సోనయాతో భేటీ తర్వాత శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటూ సమర్థంగా పనిచేస్తున్నారని ఆయన కితాబు ఇచ్చారు.
కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిపై కొందరు అసంతృప్తితో ఉన్నారని, కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. ఆంధ్రకు కూడా ఓ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, తెలంగాణకు పిసిసి అధ్యక్షుడిని నియమించాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మెజారిటీ ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. ముఖ్యమంత్రి మార్పు విషయంలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ఇప్పటికే స్పష్టం చేశారని, దానిపై చర్చ అవసరం లేదని ఆయన అన్నారు. 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన చెప్పారు.
రాయల తెలంగాణ కొత్త ప్రతిపాదన కాదని, రాష్ట్ర విభజనపై వివిధ ప్రతిపాదనలు వస్తున్నాయని ఆయన అన్ారు. విభజనకు సంబంధించి కేంద్రం నుంచి నిర్దిష్టమైన ప్రతిపాదనలు వస్తే చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం పార్టీ అధిష్టానం రాష్ట్రపతి ఎన్నికపైనే దృష్టి పెట్టిందని, రాష్ట్ర విభజనపై పెట్టలేదని ఆయన అన్నారు.