నో ఛాలెంజ్: 'తెలంగాణ'పై టిజి వెంకటేష్ యు టర్న్
తెలంగాణ ఉద్యమాన్ని తాము కొత్త విధానంలో ఎదుర్కొంటామని చెప్పారు. నిన్నటి వరకు తాము సై అంటే సై అన్నామని.. కానీ ఇప్పుడు ఏమన్నా తాము ఏమీ అనబోమని.. మా మీద ప్రేమ పెంచుకునే విధంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఏడేళ్లుగా ఎన్నో ఇబ్బందులు, భావోద్వేగాలు ఉన్నా... ఉత్సవాలను హైదరాబాదులో నిర్వహిస్తున్నామంటే రాయలసీమవాసుల మనసును, గుండె ధైర్యాన్ని, స్ఫూర్తిని అర్థం చేసుకోవచ్చనని అన్నారు.
ఈ స్ఫూర్తి ఒక్క రాయలసీమవాసులకే ఉందన్నారు. పరిపాలనాదక్షత తెలిసినవారం కాబట్టే ఓ పక్క తెలంగాణ, మరోపక్క ఆంధ్ర.. జనాభా ప్రాతిపదికన సరితూగే ఈ ప్రాంతాలకు ఓ పెద్దన్నగా ఉంటూ ఇరు ప్రాంతాలకూ న్యాయం చేస్తున్న ప్రాంతం కేవలం రాయలసీమే అన్నారు. ఈ సందర్భంగా పలువురుకి పురస్కారాలు అందజేశారు.
కాగా ఇటీవల ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర విభజనపై వాడిగా వేడిగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ నేతలు తెలంగాణ ఇవ్వాలని అధిష్టానాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు రాయల తెలంగాణ ప్రతిపాదనకు ఓకే చెప్పడం మరింత ఘాటైన చర్చకు దారి తీసింది. వారి ప్రతిపాదనను తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి తీవ్రంగా కొట్టి పారేసింది.