రాష్ట్ర విభజనకు వైయస్ జగన్ పార్టీ కొత్త కొలికి
‘ఒకరు రాయల తెలంగాణ అంటారు. మరొకరు అందుకు మేం ఒప్పుకోం అంటారు. ఇంకొకరు సీమాంధ్ర అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వీరందరూ సొంత ఎజెండాతో వ్యాపార లబ్ది కోసం ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం చాలా దారుణం. కొందరు స్టైల్గా పెద్ద పెద్ద కళ్ల అద్దాలు పెట్టుకొని కెమెరాలు కనపడే సరికి కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తూ రాజకీయాల్ని భ్రష్టుపట్టిస్తున్నారు. వారికి ప్రజల మనోభావాలు పట్టవా? రాయల తెలంగాణ కావాలని ప్రజలు అడిగారా?' ఆయన అన్నారు.
రాయలసీమ ప్రజల మనోభావాలకు విరుద్దంగా తమని అవమానపరిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. రాయలసీమ ప్రజలకేం తక్కువ, ఒకర్ని అడుక్కోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే తాము ఎవరితోనో కలిసుండాల్సిన ఖర్మలేదని, పూర్వపు రాయలసీమ, బళ్లారి, రాయచూరు జిల్లాలను కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి సర్వనాశనం చేసింది కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలే అని శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. డిసెంబర్ 9న కేంద్ర హోమంత్రి పి.చిదంబరం ఒక ప్రకటన చేసి, ఆ తర్వాత పదిరోజుల్లోనే మాట మార్చడం ద్వారా రాష్ట్రం అల్లకల్లోలమైందని అన్నారు. చేతకాని, వయస్సు మళ్లిన నేతలు, ప్రజాదారణలేని వ్యక్తుల మాటల కారణంగానే రాష్ట్రంలో ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ప్రజల్ని గందరగోళ పరిచే కంటే చేతనైతే నాలుగు మంచి పనులు చేయాలని హితవు చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా పోరాడాలో తమ పార్టీ అధ్యక్షుడు జగన్ను చూసి నేర్చుకోవాలని స్పష్టం చేశారు.
హంద్రీనీవా నీరు విడుదల చేయాలని డిమాండ్తో మంత్రి రఘువీరారెడ్డి పాదయాత్ర చేస్తానటం చాలా విచిత్రంగా ఉందని శ్రీకాంత్రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి రఘువీరా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. రెవెన్యూ మంత్రిగా ఉంటూ హంద్రీనీవా ప్రాజెక్టు భూసేకరణ కూడా చేయించలేని అసమర్థుడని ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత హంద్రీనీవాను పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. వైయస్ హయాంలో విడుదల చేసిన నిధులకు, ఈ మూడేళ్లలో జరిగిన నిధుల కేటాయింపులపై రఘువీరా శ్వేత పత్రం విడుదల చేయాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.