మరోసారి డిఎల్ ఫైర్: ముఖ్యమంత్రిపై గవర్నర్కు ఫిర్యాదు
ఇదిలా వుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలిపై ఆయన గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ముఖ్యమంత్రిపై దాదాపు ప్రతి రోజూ ధ్వజమెత్తుతూ వచ్చిన డిఎల్ రవీంద్రా రెడ్డి ఉప ఎన్నికల సమయంలో మాట్లాడవద్దని పార్టీ అధిష్టానం సూచించడంతో ఇంత కాలం మాట్లాడలేదు. ఉప ఎన్నికలు ముగియడంతో ఆయన తిరిగి ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని రాజకీయ సమరం ప్రారంభించినట్లు కనిపిస్తోంది.
వెంటనే పరిస్థితిని చక్కదిద్దకపోతే మంత్రివర్గం నుంచి వైదొలుగుతానని ఆయన ఇటీవల గవర్నర్ నరసింహన్కు రాసిన లేఖలో తెలిపినట్లు సమాచారం. దంతో గవర్నర్ ఆయనను రాజ్భవన్కు పిలిపించుకుని మాట్లాడినట్లు చెబుతున్నారు. పరిస్థితి త్వరలోనే చక్కపడుతుందని, తొందరపడవద్దని చెప్పారు. మంత్రిగా తన బాధ్యతలను నిర్వహించకుండా ముఖ్యమంత్రి అడ్డుపడుతున్నారని, బిజినెస్ రూల్స్కు విరుద్ధంగా ఫైళ్లపై తన సంతకాలు, ఆమోదం లేకుండానే తన శాఖకు చెందిన అంశాలపై ఉత్తర్వులు జారీ చేయిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా ఉత్తర్వులను జారీ చేయించారని తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన కొన్ని దృష్టాంతాలను కూడా చూపినట్లు చెబుతున్నారు. ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఫార్మాసిస్ట్ను వైద్య విద్య శాఖకు బదిలీ చేశారని, ఇందుకు తన అనుమతి తీసుకోలేదని తెలిపారు. ఫార్మాసిస్ట్ బదిలీకి సంబంధించి ముఖ్య కార్యదర్శి చేసిన సిఫారసును సంబంధిత మంత్రిగా తాను తిరస్కరించానని, అయితే ముఖ్యమంత్రి మాత్రం ఆయన బదిలీకి ఆదేశాలు జారీ చేశారని వివరించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినప్పటికీ బిజినెస్ రూల్స్ ప్రకారం ఉత్తర్వుల జారీ ఫైలు సంబంధిత మంత్రికి రావాల్సి ఉందని, కానీ తనకు ఫైలు రాకుండానే ముఖ్య కార్యదర్శి ద్వారా జీవోను జారీ చేయించారని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కొంతమంది నర్సుల సర్వీస్ను రెగ్యులరైజ్ చేసేందుకు మంత్రిగా తాను సిఫారసు చేశానని, అయితే ముఖ్యమంత్రి ఆ సిఫారసును తిరస్కరించారని డిఎల్ రవీంద్రా రెడ్డి తన లేఖలో వివరించినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిపై ఓ మంత్రి గవర్నర్కు ఫిర్యాదు చేయడం ఇదే ప్రథమమని అంటున్నారు.