వైయస్ విజయమ్మ ఢిల్లీ యాత్రపై లగడపాటి ఫైర్
మూడేళ్ల తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి మరణంపై విజయమ్మ అనుమానాలు వ్యక్తం చేయడం సరి కాదని, రాజకీయ ప్రయోజనాల కోసమే విజయమ్మ వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అన్యాయాలను తాము ప్రధాని మన్మోహన్ సింగ్కు వివరిస్తామని ఆయన చెప్పారు. ఎవరికీ లొంగకుండా పనిచేస్తుంటే సిబిఐ జెడి లక్ష్మినారాయణపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.
న్యాయమూర్తిని కూడా కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వర్గం ప్రలోభ పెట్టిందని, లొంగకుండా మొండికేస్తున్నందున లక్ష్మినారాయణపై కక్ష కట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, మీడియా ఉంది కదా అని తప్పుడు కథనాలు ఇస్తున్నారని ఆయన అన్నారు. ముద్దుల కూతురు అరెస్టయిన డిఎంకె అధినేత కరుణానిధి మౌనం వహించారని, ఆ విషయాన్ని వైయస్ విజయమ్మ గమనించడం అవసరమని ఆయన అన్నారు. వైయస్ మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పిన వైయస్ విజయమ్మ ప్రధాని వద్ద ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ఆయన అడిగారు.
కోర్టు ఆదేశాల మేరకే వైయస్ జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాప్తు చేస్తోందని ఆయన చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం సిబిఐ దర్యాప్తును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వివాదం చేస్తున్నారని ఆయన అన్నారు. సిబిఐ దర్యాప్తులో జగన్ విషయాలన్నీ బయటకు వచ్చాయని ఆయన అన్నారు. కృష్ణా డెల్టాలో వరి తప్ప మరో పంట పండదని, వరి పంటకు నాగార్జునసాగర్ జలాలే ఆధారమని, సదుద్దేశంతోనే కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని ఆయన అన్నారు. తెలంగాణలో ఎంబిబియస్, పిజి సీట్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు.