పార్టీ ఆఫీస్కు వెళ్తానో వెళ్లనో: బాబుపై తగ్గని తలసాని
తన అసంతృప్తిని చంద్రబాబుకు వివరించానని తెలిపారు. ప్రతి పార్టీలోనూ ఒడిదుడుకులు సహజంగానే ఉంటాయని చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీలోనూ ఉన్నాయన్నారు. చంద్రబాబుతో రాజకీయాల పైన కూడా చర్చించినట్లు చెప్పారు. తాను పార్టీ కార్యాలయానికి వెళతానో లేదో చెప్పలేనని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే పార్టీ పైన అసంతృప్తి తగ్గినట్లుగా కనిపించడం లేదు.
సుమారు గంటకు పైగా బాబుతో తలసాని చర్చలు జరిపారు. తన అసంతృప్తిని కూలంకషంగా ఆయనకు వివరించారు. బాబు కూడా తలసానిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అయితే బుజ్జగింపులు ఫలితం ఇవ్వలేదని తెలుస్తోంది. బాబుతో భేటీ అయ్యాక కూడా తాను పార్టీ కార్యాలయానికి వెళతానో లేదో అని తలసాని తన అసంతృప్తిని మరోమారు వ్యక్తం చేయడం గమనార్హం.
కాగా తలసాని ఇటీవల రాజ్యసభ ఎన్నికలప్పటి నుండి పార్టీ పైన అసంతృప్తితో ఉన్నారు. 2009లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన తలసాని కాంగ్రెసు ఎమ్మెల్యే జయసుధ చేతిలో ఓడిపోయారు. రాజ్యసభ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. తనకు ఇవ్వకపోవడమే కాకుండా పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్కు టిక్కెట్ ఇవ్వడం ఆయనకు తీవ్ర ఆగ్రహం కలిగించింది.
తలసాని అప్పుడే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. రాజ్యసభ అభ్యర్థి కోసం బాబు చర్చిస్తున్నప్పుడు మధ్యలోనే బయటకు వచ్చేశారు. పార్టీ భవిష్యత్తు పైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టిన ఆయన ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో పెట్టలేదు. ప్రెస్ క్లబ్లోనే విలేకరుల సమావేశం నిర్వహిస్తూ వస్తున్నారు. పార్టీలో ఉండే అంశంపై విలేకరులు ప్రశ్నించినప్పుడు కూడా పొడి పొడిగా సమాధానం చెబుతున్నారు.