పద్మనాభ ఆలయం ఆరో గదిపై గుప్పుమన్న వార్తలు
విదేశాల నుంచి తెప్పించిన అత్యాధునిక పరికరాలతో నిపుణలు ఐదో గదిలోని నేలమాళిగలోకి మాత్రమే ప్రవేశించారని తెలుస్తోంది. అందులోని సంపదను లెక్కించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ గదిలో అంతులేని సంపద ఉందనే ఊహాగానాలు కూడా చెలరేగుతూ వచ్చాయి. నేలమాళిగ ఎ సంపద లెక్కింపు ఆరు నెలల పాటు సాగుతుందని భావిస్తున్నారు. ఈ గదిలో పది లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపద ఉండవచ్చునని స్థానిక టీవీ చానెళ్లు అంచనా వేసి చెబుతున్నాయి.
గదిలో సరప్పోలి మాల, నాణేలు, కిరీటాలు ఉండవచ్చునని అంటున్నారు. సంపదను నేలమాళిగ నుంచి బయటకు తెచ్చి లెక్కిస్తారని అంటున్నారు. ఇందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు రెండు రోజుల్లో జరుగుతాయని చెబుతున్నారు. సి, డి నేలమాళిగల్లోని సంపద లెక్కింపు దాదాపు పూర్తయినట్లుగా చెబుతున్నారు. దీంతో ఎ నేలమాళిగను తెరవాలని నిపుణుల కమిటీ నిర్ణయించింది.
భారీ భద్రత మధ్య సంపద లెక్కింపు జరిగింది. ఈ వ్యవహారాన్ని మొత్తం వీడయో తీశారు. దాన్ని ఇస్రో సర్వర్లో భద్రపరిచారు. వజ్రాలు, రత్నాలు వంటి విలువైన వస్తువుల లెక్కింపునకు జర్మనీ నుంచి తెప్పించిన ప్రత్యేక పరికరాన్ని వాడుతున్నారు. లెక్కింపు తర్వాత వస్తువులను ఇనుప ట్రంకుల్లో భద్రపరుస్తున్నారు.