బాబ్రీ కూల్చివేతప్పుడు పూజలో కూర్చున్న పివి
బాబ్రీ మసీదు కూల్చివేతకు పివి నర్సింహారావు సహకరించారని చెప్పడానికి ఆయన ఈ ఆరోపణ చేశారు. కుల్దీప్ నయ్యర్ ఆత్మకథలో పివి నర్సింహారావు ప్రభుత్వం అనే అధ్యాయం ఉంది. పూజలో కూర్చున్న పివి నర్సింహారావు చెవిలో ఆయన సహాయకుడు మసీదును కూల్చారని ఊదాడని, ఆ తర్వాత క్షణాల్లోనే పివి పూజ ముగించారని మధు లిమాయే (సోషలిస్టు నాయకుడు) తనతో చెప్పారని ఆ అధ్యాయంలో కుల్దీప్ నయ్యర్ రాశారు.
కుల్దీప్ నయ్యర్ ఆరోపణను పివి నర్సింహారావు కుమారుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పివి రంగారావు ఖండించారు. ఆ మాటలు నమ్మశక్యంగా లేవని ఆయన అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై పివి ఆగ్రహం చెందారని, ఏళ్ల తరబడి ముస్లింలను పివి ప్రేమించారని, అది జరిగి ఉండాల్సింది కాదని తమతో చాలా సార్లు అన్నారని ఆయన వివరించారు. కుల్దీప్ నయ్యర్ వంటి ప్రముఖ జర్నలిస్టు స్వార్థ ప్రయోజనాల కోసం తన తండ్రిపై విషం చిమ్మడం సరి కాదని ఆయన అన్నారు.
బాబ్రీ కూల్చివేత తర్వాత అల్లర్లు చెలరేగినప్పుడు పివి నర్సింహారావు కొంత మంది జర్నలిస్టులను తన నివాసానికి ఆహ్వానించారని కుల్దీప్ నయ్యర్ రాశారు. కూల్చివేతను అపడానికి తాము చేసిన ఏర్పాట్లను వివరించడానికి బాధపడ్డారని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ తనను మోసం చేశాడని పివి చెప్పారని ఆయన రాశారు.
కాంగ్రెసు పార్టీలో మసీదు కూల్చివేత వల్ల లుకలుకలు ప్రారంభం కాలేదని, అంతర్గత వైరుధ్యాల వల్లనే లుకలుకలు పుట్టాయని, పివి నర్సింహారావును సోనియా గాంధీ ఎప్పుడూ ఇష్టపడలేదని నయ్యర్ రాశారు.