తెలంగాణపై స్పష్టత ఇస్తాం, ఉప పోరుతో జాప్యం: బాబు

కోట్ల రూపాయల ప్యాకేజీల వల విసిరి పార్టీని బలహీనపర్చాలని అనుకొంటే అది భ్రమేనని, చీల్చిన ప్రతిసారీ తమ పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని వ్యాఖ్యానించారు. '1984లో ఇందిరా గాంధీ టీడీపీ ఎమ్మెల్యేలను చీల్చి ఎన్టీ రామారావును గద్దె దించాలని ప్రయత్నించారు. తర్వాతి ఎన్నికల్లో పార్టీకి మూడు వంతుల సీట్లు వచ్చాయి. 1991లో మా పార్టీ ఎంపీలను కొనుగోలు చేసి పార్టీని చీల్చాలని ఆనాటి ప్రధాని పీవీ ప్రయత్నించగా తర్వాత కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వైయస్సార్ కాంగ్రెసు వంటి పార్టీలు ఇప్పుడు అదే మాదిరి 'ప్యాకేజి' రాజకీయాలకు పాల్పడుతున్నాయి'' అని దుయ్యబట్టారు. వారి (జగన్) విశ్వసనీయత వారిని జైలుకు పంపిస్తే తమ విశ్వసనీయత ధైర్యంగా నిలబడేలా చేసిందన్నారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టి పోయిందని, రైతులు గతంలో ఎన్నడూ లేనంతగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జలయజ్ఞం పేరుతో 75 వేల కోట్లు ఖర్చు చేసినా రైతులకు కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీరు అందలేదని, ప్రభుత్వం తన అసమర్థతతో రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్గా మారుస్తోందని, విద్యార్థులకు ఉపకార వేతనాలు, పుస్తకాలు, యూనిఫాంలు ఏవీ లేవని, ఈ సమస్యలన్నింటిపైనా మనం చిత్తశుద్థితో పోరాడాల్సి అవసరం ఉందని ఆయన అన్నారు.
"ఎస్సీ వర్గీకరణ అంశంపై కూడా పార్టీలో చర్చిస్తున్నాం. జనాభా దామాషా ప్రకారం సామాజిక న్యాయం జరగాలని మేం కోరుకొంటున్నాం. త్వరలో మా విధానం ప్రకటిస్తాం' అని ఆయన వెల్లడించారు. పార్టీ మహానాడును వచ్చే మే నెల నాటికి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ నెల 20 నుంచి 30 వరకూ గ్రామ కమిటీలు, వచ్చే నెల 5 నుంచి 20 వరకూ మండల, పట్టణ కమిటీలు, 25- 30 మధ్యలో జిల్లా కమిటీల ఎన్నికలు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications