'వికెట్'లో రాజకీయం లేదు, వైయస్ను లాగకండి: కిరణ్
ఈ నెల 21వ తేదిన రంగారెడ్డి, హైదరాబాదులలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటానని చెప్పారు. చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ వ్యాఖ్యలపై తాను ఇదివరకే స్పందించానని చెప్పారు. అధికారులపై ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పని, మిగతా మంత్రులు ఎవరూ హద్దులు మీరవద్దని సూచించారు. పిసిసి చీఫ్ బొత్సతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు.
రాష్ట్రానికి గ్యాస్ సరఫరా చేసేందుకు గెయిల్ అంగీకారం తెలిపిందన్నారు. రాష్ట్రానికి అవసరమైన గ్యాస్ త్వరగా ఇందన శాఖ నుండి వస్తుందని చెప్పారు. 2013 వరకు కరెంట్ కష్టాలు తప్పవేమో అన్నారు. ఈశాన్య దక్షిణ భారత్ కలిపి పవర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే తప్ప విద్యుత్ కష్టాలు పోవన్నారు. ఇది 2013లో పూర్తి చేయాలన్నారు. వినియోగదారులు విద్యుత్ సర్ చార్జిలు చెల్లించాల్సిందేనని కుండబద్దలు కొట్టారు.
సర్ చార్జిలు మోయడం ప్రభుత్వం వల్ల కాదన్నారు. రెండో దఫా ఇందిరమ్మ బాట కార్యక్రమం షెడ్యూల్ తయారు చేస్తామన్నారు. మంత్రులు కూడా జిల్లాల్లో ఇందిరమ్మ బాటలో పాల్గొనాలని సూచించారు. ప్రతి నెల 100 నియోజకవర్గాలు కవర్ చేయాలని సూచించారు. సకల జనుల సమ్మె సమయంలో హైకోర్టులో జరిగిన ఘటనపై సుప్రీం వ్యాఖ్యలను గౌరవిస్తున్నామని, అందుకు సంబంధించిన వివరాలను, చేపట్టిన చర్యలను తెలియజేస్తామన్నారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విషయంపై రాద్దాంతం చేయవద్దని ఆయన కాంగ్రెసు పార్టీ నేతలకు సూచించారు. క్యాంప్ ఆఫీసులో వైయస్ ఫోటో ఉండటంపై వి హనుమంత రావు తప్పు పట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. వైయస్ను విమర్శించవద్దని, ఆయనను వివాదాలలోకి లాగవద్దన్నారు.
కాగా మంత్రుల ఇందిరమ్మ బాటపై సమాచార శాఖ ప్రదర్శించిన అత్యుత్సాహంపై కిరణ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు ఎన్ని రోజులు జిల్లాల్లో తిరగాలో ఇంకా నిర్ణయించలేదన్నారు. ముఖ్యమంత్రికి సమాచారం లేకుండానే సమాచార శాఖ మంత్రుల ఇందిరమ్మ బాట షెడ్యూల్ను ప్రచురించడం గమనార్హం. దీని పైనే కిరణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.