రాష్ట్రపతి ఎన్నిక: జగన్కు ప్రత్యేక వాహనం, ఎస్కార్ట్
కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి కోర్టు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు అనుమతి ఇచ్చింది. దీంతో వారిని ప్రత్యేక వాహనంలో చంచల్గుడా జైలు నుంచి శాసనసభకు తీసుకు వస్తారు. వారికి తగిన ఎస్కార్టును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అనురాగ్ శర్మ చెప్పారు. రేపు (గురువారం) పదిన్నర గంటల ప్రాంతంలో వారిని శాసనసభకు తీసుకుని వచ్చి ఓటు వేసిన తర్వాత తిరిగి చంచల్గుడా జైలుకు తరలిస్తారు.
కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. కాగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటుంది. కాంగ్రెసు వ్యతిరేక వైఖరిలో భాగంగా ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. దీంతో పోలింగుకు దూరంగా ఉంటోంది. తెరాసకు 18 మంది శానససభ్యులు, ఇద్దరు పార్లమెంటు సభ్యులు ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 17 మంది శాసనసభ్యులు, ఇద్దరు పార్లమెంటు సభ్యులు ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు చేయాల్సిన పద్ధతిపై సిఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ పార్టీ శాసనసభ్యులకు వివరించారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీపై పిఎ సంగ్మా పోటీ పడుతున్నారు. సంగ్మాకు బిజెపి మద్దతు ఇస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ విజయం దాదాపుగా ఖాయమైందని అంటున్నారు.