వైయస్ జగన్ జైలులో ఉండేవారు కారు: శోభా నాగిరెడ్డి
తాము కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయితే తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైలులో ఉండేవారా అని ఆమె ప్రశ్నించారు. అలాగే తెలుగుదేశం పార్టీ శాసనసభలో ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇచ్చి ఉండేవారం కాదని, దాని వల్ల తాము తిరిగి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదని ఆమె అన్నారు. ప్రణబ్ ముఖర్జీ సీనియర్ నేత, అనుభవజ్ఞుడు అని, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయకపోవడం మంచిది కాదని చంద్రబాబు అన్నారని ఆమె గుర్తు చేశారు.
చంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకోకపోవడాన్ని నేరంగా పరిగణించాలని ఆమె అన్నారు. ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెసు పార్టీ వ్యక్తి కారని, అందుకే తాము ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేస్తున్నామని ఆమె చెప్పారు. జెడి(యు) నేత శరద్ యాదవ్, లోకసత్తా నేత జయప్రకాశ్ నారాయణ ఓటేశారని, వారు కూడా కాంగ్రెసుతో లాలూచీ పడినట్లేనా అని ఆమె అన్నారు. కాంగ్రెసుతో ప్రణబ్ ముఖర్జీకి సంబంధం లేదని ఆమె అన్నారు. ప్రణబ్ సరైన అభ్యర్థి అని తాము ఓటేశామని ఆమె అన్నారు. తాము మొత్తం 20 మందిమి ఓటేయడానికి వచ్చామని, ఆళ్ల నాని, రంగారావు, బాలనాగిరెడ్డి కూడా వచ్చారని ఆమె అన్నారు.
తాము కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయినట్లు వచ్చిన ఆరోపణలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఖండించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలతో తాము కుమ్మక్కవుతామా అని ఆయన అడిగారు. ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీల కన్నా తమకే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. సమర్థుడు కాబట్టే తాము ప్రణబ్ ముఖర్జీకి ఓటేశామని ఆయన అన్నారు.