మళ్లీ అట్టుడికిన ఉస్మానియా: భాష్పవాయు ప్రయోగం
పోలీసులపైకి విద్యార్థులు రాళ్లు విసిరారు. ప్రణబ్ ముఖర్జీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బారికేడ్లను తొలగించుకుని ముందుకు పోవడానికి విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయు ప్రయోగం చేశారు. విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, రాష్ట్రపతి ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) దూరంగా ఉంది. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడాన్ని వ్యతిరేకిస్తూ తెరాస రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయకూడదని నిర్ణయించుకుంది. అదే సమయంలో పోలింగు సందర్భంగా గురువారం ఉదయం తెరాస శాసనసభ్యులు శాసనసభ వరకు ర్యాలీ తీశారు.
కాగా, తెలంగాణకు మద్దతు ఇస్తున్న తెలంగాణ నగారా సమితి నాయకుడు, శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు శాసనసభ్యులు హరీశ్వర్ రెడ్డి, సముద్రాల వేణుగోపాలాచారి బిజెపి బలపరిచిన పిఎ సంగ్మాకు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెసు తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిరసనగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.