ఓటేసిన చిన్నం, బాలనాగిరెడ్డి: రాజేష్తో జగన్ ఎమ్మెల్యే
మరోవైపు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య, బాలనాగి రెడ్డిలు అసెంబ్లీలో ఓటు వేశారు. టిడిపి రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ వారు ఓటు వేశారు. బాలనాగి రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేతగా ముద్ర పడగా, చిన్నం రామకోటయ్య కాంగ్రెసు వైపుకు వెళుతున్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇప్పటికే ఇచ్చేశారు.
చిన్నం మంత్రి పార్థసారధితో కలిసి తన ఓటును వేశారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ తొలి ఓటు వేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తదితరులు అసెంబ్లీలో తమ ఓటును వేశారు. ఓటు వేసేందుకు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు ఎమ్మెల్యేలు రాజేష్, బాలరాజులు కలిసి ఒకే కారులో రావడం గమనార్హం. ఓటు వేసేందుకు వైయస్ విజయమ్మ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో గురువారం మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రజాప్రతినిధులు అందరూ వస్తుండటంతో అసెంబ్లీ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో అసెంబ్లీ ముందు నుండి వచ్చి పోయే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలోని శాసనసభ భవనాలలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి.