జలమయం: 9 మంది దుర్మరణం, నిద్రలోనే పైలోకాలకు
ఇదిలావుంటే, హఫీజ్పేటలోని ఆదిత్యనగర్లో ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. వీరంతా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. మృతుల్లో తల్లి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా హైదరాబాదు, సికింద్రాబాదుల్లోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నివాసాల్లోకి కూడా నీరు చేరి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మీర్పేట, దిల్షుక్ నగర్, పంజగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, మలక్పేట, తర్నాకా, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో నివాసాల్లోకి నీరు వచ్చి చేరింది.
హైదరాబాదులో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాదులో శనివారం కూడా వర్షం కురుస్తోంది. ఈ నెల 23వ తేదీ వరకు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధక కేంద్రం తెలుపుతోంది. 25వ తేదీన వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. హైదరాబాదు పరిస్థితిపై ఆయన జిహెచ్ఎంసి అధికారులతో ఆయన చర్చించారు పారిశుద్ధ్య వైద్య సహాయక బృందాలను సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
సికింద్రాబాదులోని బోయిగుడా రోడ్డు చెరువును తలపిస్తోంది. పూర్తిగా నీటితో నిండిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సోమాజిగుడా వద్ద కూడా ఇదే పరిస్థితి. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ పరిశోధక కేంద్రం తెలిపింది.