నిన్నబాబు, చిరు ఇప్పుడు జగన్: శోభనాగిరెడ్డిపై రేవంత్
తనపై, టిడిపిపై శోభా నాగి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. భూమా దంపతులకు తనను, తమ పార్టీని విమర్శించే హక్కు లేదన్నారు. తాను ఎలాంటి భూఆక్రమణలకు పాల్పడలేదని, ఇందుకు తాను హైటెక్ సిటీ లేదా వారి సొంత నియోజకవర్గం ఆళ్లగడ్డలో కూడా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఫ్యాక్షన్ ద్వారానే ఎన్నికలలో నెగ్గుకు వస్తుందో ప్రజలందరికీ తెలుసునన్నారు.
తెలంగాణకు వస్తే తన నియోజకవర్గంలో తాను ప్రజా సంక్షేమ పథకాల కోసం ఎలా పాటుపడుతోంది అనిపిస్తానని చెప్పారు. ఒకప్పుడు టిడిపిని, ఆ తర్వాత చిరును, ఇప్పుడు జగన్ను ఆకాశానికెత్తేస్తున్నారని, నాలుగేళ్లలో మూడు పార్టీలు మారిన వారు తన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
కాంగ్రెసుతో జగన్ పార్టీ చీకటి ఒప్పందం చేసుకున్నారన్నారు. స్పీకర్ ఎన్నికలలో కనిపించని రాజ్యాంగ విలువలు, ఓటు హక్కు నైతిక విలువలు, ప్రజాస్వామ్య విలువలు ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలలో కనిపించడానికి కారణం జగన్ జైలు జీవితమే కారణమని అన్నారు.
కాగా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలను బట్టి ఆయన మానసిక స్థితి బాగా లేదని అర్థమవుతోందని శోభా నాగి రెడ్డి శనివారం వ్యాఖ్యానించారు. జగన్ బెయిల్ ఖరీదు ప్రణబ్ ముఖర్జీకి ఓటుగా మారిందని రేవంత్ రెడ్డి అనటం ఆ పార్టీకి చట్టం, రాజ్యంగం, న్యాయస్థానాల పట్ల లెక్కలేనితనాన్ని చూపిస్తున్నాయని విమర్శించారు.