తెలంగాణాలో కొత్తగా 10 నర్సింగ్ కాలేజీలు : వారికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి!
తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్ విద్యా వ్యవస్థను ఆధునికీకరించడంతో పాటు, బలోపేతం చేయడం దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ముఖ్యమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నర్సింగ్ కౌన్సిల్ బలోపేతంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి ఈ మేరకు కీలక నిర్ణయాలను వెల్లడించారు.
నర్సింగ్ విద్యార్థులకు కెరీర్ డెవలప్మెంట్ అవకాశాలు
నర్సింగ్ రంగంలో నాణ్యత మెరుగుపరచడం ద్వారా రాష్ట్రంలోని ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రధానంగా GNM (జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ) పూర్తిచేసిన విద్యార్థులకు కెరీర్ డెవలప్మెంట్ అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. వారు పోస్ట్ బేసిక్ B.Sc నర్సింగ్ కోర్సులో B.Sc నర్సింగ్ కాలేజీల్లో చేరేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇది GNM విద్యార్థుల ఉద్యోగావకాశాలను మరింత పెంచుతుందన్నారు.

నర్సింగ్ విద్య కోసం 10 కొత్త B.Sc నర్సింగ్ కాలేజీలు
రాష్ట్రంలో నర్సింగ్ విద్యను విస్తరించడానికి 10 కొత్త B.Sc నర్సింగ్ కాలేజీలు మరియు ఒక M.Sc (పీజీ) నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా, మిడ్ వైఫరీ కోర్సులను మరింత బలోపేతం చేసి, నాణ్యమైన శిక్షణ అందించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. నర్సింగ్ కౌన్సిల్ సమర్థవంతంగా పని చేయడానికి రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టార్ పోస్టును సృష్టించాలని మంత్రి నిర్ణయం తీసుకున్నారు.
నర్సింగ్ కౌన్సిల్ కార్యాలయంలో అన్ని వసతులు కల్పించాలన్న మంత్రి
కౌన్సిల్ కార్యాలయానికి వచ్చే విద్యార్థులు, నర్సులు, ఉద్యోగుల సౌకర్యార్థం కార్యాలయ ప్రాంగణంలో తాగునీరు, విశ్రాంతి గదులు, టాయిలెట్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. మంత్రి మాట్లాడుతూ, నర్సింగ్ విద్యార్థులు మరియు నర్సులు ఆధునిక సాంకేతికతతో శిక్షణ పొంది, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థకు బలం చేకూర్చాలి. ప్రభుత్వం ఈ దిశగా అన్ని చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు.
జాతీయ స్థాయిలో తెలంగాణా నర్సింగ్ కు గుర్తింపు వచ్చేలా నిర్ణయం
ఈ కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా తెలంగాణలో నర్సింగ్ రంగం జాతీయ స్థాయిలో మెరుగైన స్థానం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాలు అమలు అయితే తెలంగాణలో నర్సింగ్ విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు, నాణ్యత మెరుగుపడి, ఆరోగ్య రంగం మరింత బలపడుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగంలో చేపడుతున్న సంస్కరణల్లో ఇది ఒక ముఖ్యమైన అడుగు.













Click it and Unblock the Notifications