బాబుకు మోహన్బాబు హ్యాండ్, జగన్తో వెళ్లినట్లేనా?
జగన్ పార్టీలో చేరేందుకు మోహన్ బాబు ఆసక్తి చూపిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం మోహన్ బాబు తిరుపతిలోని తన శాంతినికేతన్ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవానికి చంద్రబాబును ఆహ్వానించారు. చాలా రోజుల తర్వాత చంద్రబాబును మోహన్ బాబు ఆహ్వానించారు. అంతేకాకుండా తామిద్దరం ఎవరి పనుల్లో వాళ్లం బిజీ అయిపోయి ఎవరికి వాళ్లంగా ఉన్నామని, ఇక నుండి ఇద్దరం కలిసి పని చేస్తామని చంద్రబాబు చెప్పగా, మోహన్ బాబు కూడా దాదాపు అలాంటి వ్యాఖ్యల చేశారు.
దీంతో అతను తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వెళతారనే ప్రచారం జోరుగా జరిగింది. బాబుతో విభేదాలు సమసి పోయిన, నందమూరి బాలకృష్ణతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో మోహన్ బాబు టిడిపిలో క్రియాశీలక పాత్ర పోషిస్తారని భావించారు. అయితే ఆ తర్వాత జగన్... మోహన్ బాబు ఇంటికి వెళ్లడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మంచు విష్ణుకు కవలలు పుట్టినందు వల్ల శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చారని, కేవలం బంధుత్వం కారణంగానే కలిశామని చెప్పారు.
తాజాగా మంగళవారం జైలులో జగన్ను కలిశారు. బాబును తన పాఠశాల వార్షికోత్సవానికి ఆహ్వానించన తర్వాత మోహన్ బాబు మళ్లీ ఎక్కడా అటు వైపుకు వెళుతున్నట్లుగా కనిపించలేదు. కానీ జగన్తో భేటీలు చూస్తుంటే మాత్రం ఆయన ఖచ్చితంగా జగన్ వైపుకు వెళ్లేందుకే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంచల్గూడ జైలు వద్ద మోహన్ బాబు మాట్లాడుతూ.. జగన్ జైలు జీవితంపై ఆవేదన వ్యక్తం చేశారు.
తాను తన మేనల్లుడిని కలిశానని, గుండె బరువెక్కిందని చెబుతూ.. అతని అరెస్టుపై ఢిల్లీ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని మహాభారతంలో శకునితో పోల్చారు. బంధుత్వం నేపథ్యంలో జగన్ను కలిసినప్పటికీ.. ఆ తర్వాత రాజకీయాల పరంగా స్పందించడం, కాంగ్రెసు నేతలపై విమర్సలు చేయడం మోహన్ బాబు వైయస్సార్ కాంగ్రెసు వైపు వెళ్లే సంకేతాలే అంటున్నారు. జగన్ వైపు వెళ్లినట్లేనా అనే చర్చ రాజకీయ నేతల్లో కూడా జోరుగా జరుగుతోంది. మోహన్ బాబు మాత్రం ఇప్పటి వరకు తాను ఏ పార్టీలో చేరేది స్పష్టంగా వెల్లడించలేదు.