చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ, కెసిఆర్పై గట్టు ఫైర్

తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని గట్టు రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న ఎంత మంది కుటుంబాలను కెసిఆర్ పరామర్శించారని ఆయన అడిగారు. తెలంగాణలో తమ పార్టీ బలపడుతోందనే తెరాస కెసిఆర్ కుట్ర చేశారని ఆయన అన్నారు.
భవిష్యత్తులో తెరాస ఇలాగే వ్యవహరిస్తే గ్రామాల్లో తిరగనివ్వని సత్తా తమ పార్టీకి ఉందని ఆయన హెచ్చరించారు. తెరాస ఆగడాలను ఖండించాల్సింది పోయి ఒక వర్గం మీడియా మద్దతు పలకడం దారుణామని ఆయన అన్నారు. సిరిసిల్ల ధర్నాపై ఈనాడు ఘోరంగా అబద్ధాలు రాసిందని ఆయన అన్నారు. ఇప్పటికైనా మీడియా ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని ఆయన కోరారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదని వైయస్సార్ కాంగ్రెసు అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలుగుదేశం నాయకులు సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరిస్తున్నారని ఆమె అన్నారు. ఆ పార్టీ నేతలు దయచేసి జాతీయ పత్రికలు చదివితే వాస్తవాలు తెలుస్తాయని ఆమె అన్నారు.
చంద్రబాబు అవినీతిని కచ్చితంగా నిరూపిస్తామని ఆమె చెప్పారు. చంద్రబాబు దొరకని దొంగ మాత్రమేనని, నీతిమంతుడు కాదని ఆమె వ్యాఖ్యానించారు. ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల సమర్థుడు చంద్రబాబు అని ఆమె అన్నారు. తెలుగుదేశం నేతలవి తాత్కాలిక సంబరాలేనని ఆమె అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం, చంద్రబాబుకు మరో న్యాయమా అని ఆమె అడిగారు.












Click it and Unblock the Notifications