పవార్కు తలొగ్గిన కాంగ్రెసు: కథ సుఖాంతం
శరద్ పవార్ తన డిప్యూటీ ప్రఫుల్ పటేల్తో కలిసి బుధవారం సాయంత్రం ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని, ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిశారు. సమన్వయలోపం, కాంగ్రెసు ఏకపక్ష నిర్ణయాలతో అసంతృప్తికి గురైన శరద్ పవార్ కేంద్ర ప్రభుత్వం నుంచి తాము తప్పుకుంటామని హెచ్చరించారు. గత కొద్ది రోజుల వివాదం ముగిసిపోయిందని సోనియా, మన్మోహన్లతో భేటీ తర్వాత ప్రఫుల్ పటేల్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ఓ సమర్థవంతమైన సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు, యుపిఎ మిత్రపక్షాలు నెలకు ఒకసారి సమావేశమై విధాన నిర్ణయాలపై, ఇతర విషయాలపై చర్చించనున్నట్లు సమావేశానంతరం ఓ ప్రకటన వెలువడింది. ఢిల్లీలో ఏర్పాటయ్యే సమన్వయ కమిటీకి సోనియా గాంధీ నేతృత్వం వహిస్తారని ప్రఫుల్ పటేల్ చెప్పారు.
మహారాష్ట్ర సంకీర్ణంలోని కాంగ్రెసు, ఎన్సిపీలతో రాష్ట్ర స్థాయిలో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఇరు పార్టీల ప్రతినిధులు ఉంటారని ఆయన చెప్పారు. 2014 వరకు తమ పార్టీ యుపిఎలో ఉంటుందని ఆయన చెప్పారు.