ప్రణబ్ ముఖర్జీ: చక్రం తిప్పేనా, రబ్బర్ స్టాంపేనా?
ఈ నేపథ్యంలో... ప్రణబ్ వంటి క్రియాశీల రాజకీయవేత్త రాష్ట్రపతి భవన్లో ఎలా వ్యవహరించబోతున్నారన్న దానిపై అందరికీ ఆసక్తి కలుగుతోంది. ఇప్పుడు తనకు రాజ్యాంగాన్ని రక్షించడం, సమర్థించడం, సంరక్షించడం వంటి గురుతర బాధ్యతల్ని అప్పగించారని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నెరవేర్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని రాష్ట్రపతిగా ఎన్నిక కాగానే ప్రణబ్ ప్రకటించారు. రాష్ట్రపతి వంటి పదవికి ఎన్నికైన తరువాత ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రసంగాలు చేశారు.
కానీ దానిని ఆచరించగల్గే వారు మాత్రం కొద్దిమందే. అందులో ప్రణబ్ ఉంటారా అనేదే అసలైన విషయం. సువిశాలమైన రాష్ట్రపతి భవన్లో నివాసం ఉండడం, నెలకు రూ.లక్షన్నర మేర జీతభత్యాలు తీసుకోవడం కాకుండా, దేశ భవిష్యత్తుకు ఆయన చేయబోయే సేవ ఏమిటి? సుమారు 60 ఏళ్లు రాజకీయాల్లో పండిపోయి, '(చిక్కు) ముళ్లు వేయడంలోనూ, ముళ్లు విప్పడంలోనూ ఆరితేరిన వ్యక్తి'గా గుర్తింపు తెచ్చుకొని, అపర చాణక్యుడిగా ప్రశంసలందుకుని, కాంగ్రెస్ పార్టీకీ, నెహ్రూ-గాంధీ కుటుంబానికి తలలో నాలుకలా మెలిగి, ఆర్థిక మంత్రిగా క్షణం తీరిక లేకుండా శ్రమించిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఏ విధంగా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారన్నది ఆ లోచించాల్సిన విషయమే.
ఇంత బిజీ వ్యక్తి రాష్ట్రపతి భవన్లో తీరికగా కూర్చోగలరా? ఇన్నేళ్లుగా పార్టీని, ప్రభుత్వాన్ని తనపై ఆధారపడేటట్టు చేసుకున్న రాజకీయ నేత మౌనంగా ఉండగలరా అనేది ప్రశ్న. కాంగ్రెస్ సీనియర్ నాయకులే కాదు, ప్రతిపక్ష నేతలు సైతం మున్ముందు రాష్ట్రపతి భవన్లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చూసే అవకాశముందని అంటున్నారు. ప్రణబ్ రబ్బర్ స్టాంప్గా ఉండిపోవడం జరిగే పని కాదని అంటున్నారు. ప్రధానమంత్రి కావాలని తపించిపోయిన వ్యక్తి తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రపతి పదవితో సర్దుకుపోవాల్సి వచ్చిందంటున్నారు.
రాష్ట్రపతి పదవికి తనను ఎంపిక చేయడం తమ నాయకురాలు సోనియా గాంధీకి సుతరామూ ఇష్టం లేదని, ఒత్తిడి మీదే ఆమె తనను ఎంపిక చేయాల్సి వచ్చిందని అంటున్నారు. ఆ విషయం ప్రణబ్కు కూడా తెలుసంటున్నారు. తాను ప్రధాని పదవిని చేపట్టాలని కోరుకున్నప్పుడు తన కంటే జూనియర్ అయిన మన్మోహన్ సింగ్ను ఆమె ఆ పదవికి ఎంపిక చేశారని, ఇవన్నీ ఆయన మనసులో ఉన్నాయని, ప్రణబ్ స్వతంత్ర భావాలున్న వ్యక్తి అని, తన శాఖలను స్వతంత్రంగా నిర్వహించిన వ్యక్తి అని, ఇతరుల సమస్యలకు తాను పరిష్కారం చూపించడమే తప్ప, తన సమస్యల్ని, ఆ మాటకొస్తే తన మనసులోని భావాల్ని కూడా ఇతరుల ముందుంచని వ్యక్తి ఆయన అంటున్నారు.
ఆయన ఏ పార్టీకీ అనుకూలంగానో, ప్రతికూలంగానో వ్యవహరించాల్సిన అవసరం లేదని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ అతలాకుతలం అవుతుందని ప్రతిపక్ష పార్టీల నేతలు అంటున్నారు. భారత రాష్ట్రపతులలో బాబూ రాజేంద్ర ప్రసాద్, జ్ఞానీ జైల్ సింగ్, అబ్దుల్ కలాం వంటి వారు కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టడానికి కూడా వెనుకాడలేదు. మరికొందరు కేంద్రానికి అనుకూలంగా వ్యవహరించారు. వీరిలో ప్రణబ్ ఏ కోవకు చెందిన రాష్ట్రపతి అవుతారో చూడాలి.