మంత్రులున్న విమానాన్ని ఢీకొన్నపక్షి, తప్పిన ముప్పు
హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న స్పైస్జెట్ విమానం హైవే వైపు నుంచి రన్వే మీదకు దిగి బుద్ధవరం వైపుకు వెళ్లింది. ఈ క్రమంలో రన్వే చివరి భాగానికి చేరేసరికి ఓ గద్ద విమానం ఎడమవైపు ఇంజన్ రెక్కలలోకి వెళ్ళిపోయింది. ఈ విషయం గమనించిన రన్వే భద్రతా సిబ్బంది విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే విమానం క్షేమంగా ఆప్రాన్ వద్దకు చేరుకుంది.
క్షేమంగా ల్యాండై, దిగుతున్న ప్రయాణికులు.. విమానాశ్రయ అధికారుల హడావుడి చూసి ఆశ్చర్యపోయారు. తర్వాత విషయం తెలుసుకుని ఆందోళన చెందారు. ఈ విమానంలో పలువురు ప్రముఖులు వున్నారు. వీరిలో కేంద్రమంత్రి దగ్గుపాటి పురందేశ్వరి. రాష్ట్రమంత్రి సి.రామచంద్రయ్య, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, మాజీ ఎంపి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి ప్రముఖులు ఉండడం గమనార్హం.
వీరికి స్వాగతం పలికేందుకు వచ్చిన అధికారులు, ప్రజలు పెనుప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు.ప్రమాదానికి గురైన విమానాన్నిమరమ్మతుల నిమిత్తం గన్నవరంలోనే ఉంచేశారు.