రెంటికి చెడ్డారా: కెవిపిపై జగన్పార్టీ సురేఖ రివర్స్ అటాక్
వైయస్ కుటుంబాన్ని వేధించినప్పుడు కెవిపి ఎందుకు స్పందించలేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఒంటరిగా పోరాడుతుంటే కెవిపి ఏనాడు పలకరించలేదని విమర్శించారు. వైయస్ను అవినీతిపరుడు అని ఆరోపించినప్పుడు కూడా ఆయన నోరు మెదపలేదని, అప్పుడు ఆయన ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పథకంలో తన ఫోటో పెట్టుకునే అర్హత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేదన్నారు.
కాగా వైయస్ ఫోటో లేకపోవడంపై కెవిపి రెండు రోజుల క్రితం గాంధీ భవనంలో అసంతృప్తి వ్యక్తం చేయడం కాంగ్రెసులో తీవ్ర రగడకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయనపై కాంగ్రెసు పార్టీ నేతలు వరుసగా విరుచుకుపడుతున్నారు. తులసి రెడ్డి, నిరంజన్ రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి, మధుయాష్కీ, వి.హనుమంత రావులు కెవిపిపై మండిపడ్డారు. కెవిపి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోవర్టు అని వారు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.