కెసిఆర్తో తేడా: చలో హైదరాబాద్ వాయిదా?
ఆగస్టులో ఉద్యమాన్ని తిరిగి ఉధృతం చేయాలనే విషయంలో ఎవరికీ పెద్దగా అభిప్రాయ భేదాలు లేకపోయినప్పటికీ తెలంగాణ మార్చ్ విషయంలో కాస్తా విభేదాలు పొడసూపుతున్నట్లు చెబుతున్నారు. తెలంగాణపై వైఖరి స్పష్టమైన చేయాలని కెసిఆర్ కేంద్రానికి కొత్త గడువు విధించిన నేపథ్యంలో తెలంగాణ మార్చ్ను వాయిదా వేసుకోవాలనే ఆలోచన సాగుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యమ కార్యాచరణకు ఇచ్చిన తేదీలను మార్చుకునే అవకాశాలున్నాయని జెఎసి నాయకులే చెబుతున్నారు.
ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా జిల్లా స్థాయిల్లో పాదయాత్రలు చేసి సెప్టెంబర్ 30వ తేదీ చలో హైదరాబాదుకు ప్రజలను సమాయత్తం చేయాలని తెలంగాణ రాజకీయ జెఎసి భావించింది. ప్రస్తుత వాతావరణంలో తెలంగాణ మార్చ్ను అక్టోబర్కు వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
వినాయక చవితి సెప్టెంబర్ 19వ తేదీన ఉండగా, నిమజ్జన నెలాఖరున జరుగుతుంది. సిఓపి సదస్సు అక్టోబర్ 1వ తేదీన ఉంది. చలో హైదరాబాద్ వాయిదా అవకాశాలకు రెండు పాయల ఉద్యమాల మధ్య తేడాలే కారణమని అంటున్నారు. అయితే, చలో హైదరాబాద్ వాయిదా పడే ప్రసక్తి లేదని కోదండరామ్ అంటున్నారు. ఇప్పటికైతే తమ కార్యక్రమాల్లో మార్పు లేదని, సెప్టెంబర్ 30వ తేదీ మార్చ్కు గణపతి మండపాలను వాడుకుంటామని ఆయన అంటున్నారు.
తెలంగాణ జెఎసి ఆగస్టు 2,3 తేదీల్లో తలపెట్టిన స్టీరింగ్ కమిటీ సమావేశాలు వాయిదా పడ్డాయి. విద్యార్థుల జెఎసి, మెడికల్ జెఎసి వంటి అనుబంధ జెఎసిల సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా మందకోడిగా జరుగుతున్నట్లు సమాచారం ఉంది. తెలంగాణ ఇస్తామంటూ తనకు సంకేతాలున్నాయనే కెసిఆర్ ప్రకటనపై వ్యాఖ్యానించడానికి కోదండరామ్ నిరాకరిస్తూనే అలాంటివి ఉంటే మంచిదేనని, అయితే తమ కార్యక్రమాల్లో మార్పు ఉండదని అన్నట్లు పత్రికలు రాశాయి.