సాహితీ దిగ్గజం వెళ్లిపోయింది: సదాశివ కన్నుమూత

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆయనకు 1998లో గౌరవ డాక్టరేట్ పురస్కారం లభించింది. హిందీ, ఉర్దూ, సంస్కృతం, మరాఠీ, పార్శీ భాషల నుంచి పలు గ్రంథాలను ఆయన తెలుగులోకి అనువదించారు. ఆయనకు 2006లో రాజీవ్ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా దయాగామ్ మండలం చెరుపల్లి ఆయన స్వగ్రామం. ఆయన 1928లో జన్మించిన ఆయన ఆదిలాబాద్లోని విద్యానగర్లో ఉంటున్నారు. వృత్తిరీత్యా ఆయన ఉపాధ్యాయుడు. కాకతీయ విశ్వవిద్యాలయం కూడా గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది.
యాది అనే ఆయన రచన విశేష ప్రాచుర్యం పొందింది. ఉర్దూలో అంజాద్ రుబాయిలు, హిందుస్థానీ గజల్స్ ఆయన పేరెన్నికగన్న రచనలు. ఆయన ఉర్దూలో కూడా క్రమం తప్పకుండా వ్యాసాలు రాస్తుండేవారు. హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంపై ఆయనకు విశేష అభిరుచి, పాండిత్యం ఉంది. పలువురు ఉర్దూ కవులను ఆయన తెలుగువారికి పరిచయం చేశారు.
ఆయన రచనలు చాలా వరకు 1950 - 60 మధ్య ప్రచురితమయ్యాయి. ఆయన తన రచనా వ్యాసంగాన్ని 1949లో ఆరు దశాబ్దాల క్రితం ప్రారంభించారు. ఆయనను అభిమానులు ఆత్మీయంగా రుషి, దీర్ఘదర్శి అని పిలుచుకుంటారు. ఆయన రచనలు ఆత్మీయంగానూ ఆసక్తికరంగానూ సాగుతాయి. ఆయన కవిత్వం సాంబశివ శతకం (1950), నిరీక్షణం (1952), ప్రభాతం (1949), విశ్వామిత్రం, సఖినామాలుగా వచ్చాయి. వాటన్నింటితో 2002లో సదాశివ కావ్యసుధ పేర గ్రంథం వచ్చింది.
సదాశివ అపశృతి (1952), ఉర్దూ సాహిత్య ప్రసక్తి (1963), పార్శీ కవుల ప్రసక్తి (1975), మిర్జా గాలిబ్ (1969), అంజాద్ రుబాయిలు (1963 - అనువాద గ్రంథం), మౌలానా రూమీ మస్నవీ (1967), కేశవ సుత్ (1970), హిందుస్తానీ సంగీతం (మలమారుతాలు - 2001), సంగీత శిఖరాలు (2006), యాది (2005) వంటి పలు గ్రంథాలను రచించారు.












Click it and Unblock the Notifications