విజయమ్మతో సోనియా: బాబుకు శోభానాగిరెడ్డి సవాల్
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి బడుగు, బలహీనవర్గాల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తివేసేందుకు కాంగ్రెస్, టిడిపిలు కుట్ర పన్నుతున్నాయని ఆమె ధ్వజమెత్తారు. వైయస్ పథకాలను ఒక్కొక్కటిగా తుంగలో తొక్కుతూ ప్రజలు ఆయన్ని మర్చిపోయేలా చేసేందుకు యత్నిస్తున్నాయన్నారు. ఫీజుల పథకాన్ని నీరుగార్చేందుకే మంత్రివర్గ ఉపసంఘం పేరుతో ప్రభుత్వం డ్రామా ఆడుతోందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారని తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో అనేకసార్లు ఆవేదన వ్యక్తం చేసినప్పుడు.. ఏ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదో చెప్పాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు అడిగారన్నారు.
ఇప్పుడు ఫీజు పథకంపై సిఎం, మంత్రులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వైయస్ కన్నా మేలైన విధంగా ఫీజుల పథకం అమలు చేస్తామన్నారు.. మరి ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ.31 వేలకు మించి చెల్లించబోమని చెప్పడం ఎంతవరకు సమంజసమని, పైగా మిగిలిన రూ.19 వేలు విద్యార్థులకు రుణాలు ఇప్పిస్తారట అని అన్నారు. రైతులకు, కౌలుదారులకే అప్పులు ఇచ్చే దిక్కులేదని విమర్శించారు. వైయస్ చేపట్టిన ఫీజులు చెల్లింపు, వృద్ధాప్య, వితంతు పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ వంటి పథకాల వల్ల సమాజంలో 50 శాతం ఉన్న బిసిలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారన్నారు.
వీటిని నీరుగార్చడంతో నష్టపోయేది ఆ వర్గాలే నష్టపోతాయన్నారు. సంక్షేమ పథకాలను ఎత్తివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, అందుకు టిడిపి సహకరిస్తోందని చెప్పారు. ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరుగుతోందన్నారు. ఫీజుల పథకాన్ని తానే ప్రవేశపెట్టానని చెప్పుకొంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారన్నారు. ఆయన హయాంలో బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ.300 ముష్టిగా మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ కూడా ఈ విషయాన్ని అసెంబ్లీలో ఉదహరించారని తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రభుత్వకుట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణ యంతో బయటపడిందని ఎమ్మెల్సీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు ఆరోపించారు. వైయస్ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయడానికి కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అండగా ఉద్యమాన్ని చేపడతామని జూపూడి తమ ప్రకటనలో హెచ్చరించారు.