ఆ ఇద్దర్ని కలిపిన ఘనత: జగన్ పార్టీలో చేరిన విజయ
ఇప్పుడు మనమంతా ఒకే పార్టీలో ఉన్నామని విజయా రెడ్డి పిజెఆర్ అభిమానులను ఉద్దేశించి అన్నారు. కాబట్టి రెండు వర్గాలుగా కాకుండా అందరం ఒకటిగా ఉండి ఉద్యమిద్దామన్నారు. ఇప్పుడు మనమంతా ఒకటే అన్నారు. ఇద్దరు నేతలను(పిజెఆర్, వైయస్ఆర్) కలిపిన ఘనత తనదే అని చెప్పారు. తాను తన తండ్రి ఆశయాలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.
మీ అందరి బలమే మన బలమని ఆమె అన్నారు. కడప పార్లమెంటు సభ్యుడు, పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల కోసమే పాటుపడతామని అన్నారు. స్వర్గీయ పిజెఆర్, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అహర్నిశలు ప్రజల కోసం పాటుపడ్డారని, అందుకే ప్రజలు వారిని గుండెల్లో దాచుకున్నారన్నారు. వారి బాటలోనే నడుద్దామని చెప్పారు. విజయా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్న సందర్భంగా భారీగా అభిమానులు తరలి వచ్చారు.
అంతకుముందు భారీగా తరలి వచ్చిన అభిమానులకు చుక్కెదురయింది. అభిమానులు పార్టీ కార్యాలయంలోకి వచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ సమయంలో తోపులాట జరిగింది. దీంతో పలువురిని అడ్డుకున్నారు. ఈ తోపులాటలో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై అనంతరం విజయా రెడ్డి స్పందిస్తూ... మనం కాస్త ఓపిక పడదామని, కొందరు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకు తాను విచారం వ్యక్తం చేస్తున్నానని ఆమె అన్నారు.
కాగా భారీగా తరలి వచ్చిన అభిమానులు జై జగన్, జై పిజెఆర్ అంటూ నినాదాలు చేశారు. పలువురు పార్టీ నేతలు ఆమెకు పార్టీ కండువా మెడలో వేసి స్వాగతం పలికారు. అంతకుముందు విజయా రెడ్డి ఖైరతాబాద్లోని మహంకాళీ అమ్మవారి గుడిలో పూజలు చేశారు. ఆ తర్వాత ఖైరతాబాద్ జంక్షన్లోని పిజెఆర్ విగ్రహానికి, పంజాగుట్ట చౌరస్తాలోని వైయస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయానికి వెళ్లారు.