రాహుల్ గాంధీ వస్తానంటే నాకు ఓకే: మన్మోహన్ సింగ్

పార్లమెంటు వర్షాకాల సమావేశాల తర్వాత సెప్టెంబర్లో జరగనున్న విస్తరణలో రాహుల్ కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశాలు ఉన్నాయని సూచనప్రాయంగా వెల్లడించారు. పార్టీ, ప్రభుత్వాల్లో రాహుల్ మరింత కీలక పాత్ర పోషించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల నాటికి రాహుల్ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో పార్టీలో ఆయనను నెంబర్-2ను చేయాలని, ప్రభుత్వంలోనూ కీలక మంత్రిత్వ శాఖ అప్పగించాలని కాంగ్రెస్లోని ఓ వర్గం నేతలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు కూడా.
పార్టీ, ప్రభుత్వాల్లో రాహుల్ మరింత పెద్ద పాత్ర పోషించాలంటూ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్య గతంలో గగ్గోలు పుట్టించిన సంగతి తెలిసిందే. అంతకుముందు, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ కూడా ప్రభుత్వంలోకి రావాలని ప్రధాని మన్మోహన్ ఇప్పటికే రాహుల్ను ఆహ్వానించారని, దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి ఆయన రాక తప్పనిసరి అని వ్యాఖ్యానించారు.
ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో రాహుల్ను లోక్సభ నేతగా ఎంపిక చేయాలంటూ ఇటీవల ఓ పదిమంది కాంగ్రెస్ ఎంపీలు పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు కూడా. దేశ ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు ఇది తప్పనిసరనీ పేర్కొన్నారు. వీటన్నిటి నేపథ్యంలో, పార్టీ, ప్రభుత్వాల్లో మరింత కీలక పాత్ర పోషించేందుకు తాను కూడా సిద్ధమేనని ఇటీవల రాహుల్ ప్రకటించారు కూడా. అయితే, అందుకు ముహూర్తాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ నిర్ణయించాలని కూడా ఆయన చెప్పారు.
దీంతో, రాహుల్ను పార్టీ ఉపాధ్యక్షుడు లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ను చేయవచ్చంటూ ఊహాగానాలు వచ్చాయి. అయితే, వీటిని కాంగ్రెస్లోని కొంతమంది నేతలు కొట్టిపారేశారు. పార్టీ అధ్యక్షురాలు క్రియాశీలంగా లేనప్పుడు మాత్రమే అటువంటి పరిస్థితి వస్తుందని, సోనియా ఇప్పుడు క్రియాశీలంగానే ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత కేంద్ర మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరిస్తారని కాంగ్రెస్లోని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications