గుండెల్లో రైళ్లు: వాయలార్కు చిరు సహా ఎంపిల మొర

ఎన్నికలకు కేవలం 18 నెలల గడువు మాత్రమే ఉందని, రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే తమ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ఏం చేయాలో పాలుపోవడం లేదని వారు వాయలార్ రవి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆవేదనతో ఏకీభవించిన వయలార్.. అందుకు తగిన చర్యలు చేపట్టాల్సి ఉందన్న విషయాన్నీ అంగీకరించారు. జాప్యం చేస్తున్నకొద్దీ కాంగ్రెసుకు నష్టం జరుగుతుందనే విషయం తమకు తెలుసునని, త్వరలో పకడ్బందీ చర్యలు తీసుకుంటామని రవి వారితో చెప్పారు. పార్టీ నేతలందరితో చర్చిస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం.
పూర్తిగా అధిష్ఠానంపై ఆధారపడకుండా పార్టీ నేతలు ఎవరికి వారు పార్టీ ప్రతిష్ఠ పెంచేందుకు ప్రయత్నించాలని వి హనుమంతరావు అన్నారు. ముఖ్యమంత్రి తన పర్యటనలో జగన్ అనుయాయులను ప్రోత్సహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఢిల్లీలో దళిత క్రైస్తవుల ర్యాలీకి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి హాజరు కావడంపై ఓ ఎంపీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాగా, ఆదివారం హైదరాబాద్లోనూ, సోమవారం ఢిల్లీలోనూ వయలార్ రవి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కొత్త చర్చకు తెరతీశాయి.
నాయకత్వ మార్పుపై సందేహాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం రాత్రి ఎంపీ పాల్వాయి గోవర్ధన రెడ్డి వైవాహిక స్వర్ణోత్సవాలనికి హాజరైన వయలార్ రవి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకత్వ మార్పుపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలను ఆయన ఖండించలేదు. నాయకత్వ మార్పు ఉండదని తెగేసి చెప్పలేదు. నాయకత్వ మార్పు అంశం ప్రైవేటు వేడుకల్లో మాట్లాడేది కాదని, బహిరంగంగా వెల్లడించేదీ కాదని, దీనిపై అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటామని ఆయన అన్నారు.
అయినా, మళ్లీ వారం రోజుల్లోనే హైదరాబాద్ వస్తానని, రెండు రోజులు ఇక్కడే ఉంటానని, రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి అవసరమైన చర్యలపై చర్చిస్తామని వ్యాఖ్యానించారు. తప్పితే, నాయకత్వ మార్పు ఉండదని ఆయన స్పష్టం చేయలేదు. దీనికితోడు, ఆలస్యం చేస్తే పార్టీకి నష్టమని సోమవారం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశంపైనా దృష్టి సారిస్తామని వయలార్ చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఇంతకాలం తెలంగాణ అంశానికీ నాయకత్వ మార్పునకూ లంకె ఉందని పార్టీ ముఖ్య నేతలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఈ రెండు అంశాలనూ వయలార్ ప్రస్తావించడంతో రాష్ట్ర కాంగ్రెస్లో ఒక్కసారిగా అలజడి ప్రారంభమైంది. కొంతకాలంగా స్తబ్ధంగా ఉన్న నాయకత్వ మార్పు అంశం కాంగ్రెస్ పార్టీలో మరోసారి చర్చనీయాంశమైంది. ఇక, ఆదివారం వయలార్తో మంత్రులు గీతారెడ్డి, ఉత్తమకుమార్రెడ్డి సమావేశమైతే, సోమవారం వేకువ జామునే వయలార్తో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. ఈ భేటీలో వారి మధ్య రాష్ట్ర రాజకీయ పరిణామాలు మరో దఫా చర్చకు వచ్చాయి.
కాగా, ఈనెల 16న వయలార్ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక, కాంగ్రెస్ కోర్ కమిటీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆయన స్థానంలో కొత్త నేతకు అవకాశం ఇవ్వడంతోపాటు ఎఐసిసిని పునర్వ్యవస్థీకరించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే వయలార్కు రాష్ట్ర వ్యవహారాలను చక్కదిద్దే బాధ్యత మరింత పెరుగుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications