పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు, జనసేన కార్యకర్త అరెస్ట్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేళ నుంచి రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణలో నిర్వహించిన మీడియా సమావేశం తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెంచింది. ఇదే క్రమంలో జనసైనికులు హద్దులు మీరారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసే ధోరణిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను, జనసేన పార్టీ కార్యకర్త కొర్ర చందర్ లాల్ను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.
కటకటాల్లోకి జనసేన కార్యకర్త.. 'ఎక్స్' లో పోలీసుల వార్నింగ్
ముఖ్యమంత్రిపై అనుచిత పోస్టులు పెట్టిన చందర్ లాల్పై కేసు (నెంబర్ 395/2026) నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు తెలంగాణ పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీసుల అధికారిక 'ఎక్స్' (X) ఖాతా స్పందిస్తూ గట్టి హెచ్చరిక జారీ చేసింది. "సోషల్ మీడియాలో అభిప్రాయాలను పంచుకునేటప్పుడు ప్రజలు తమ కామన్సెన్స్ కోల్పోకూడదు. ప్రజా విధుల్లో ఉన్నవారిపై విమర్శలు చేసేటప్పుడు హద్దులు దాటడం సరికాదు. ఇదే ధోరణిలో ఎవరైనా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని స్పష్టం చేశారు.

గద్దర్ 'కారు' కామెంట్స్ వివాదం.. పవన్ కళ్యాణ్పై కేసు!
ఈ అరెస్ట్ వ్యవహారం నడుస్తుండగానే, మరోవైపు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై హైదరాబాద్లో కేసు నమోదు కావడం సంచలనం సృష్టించింది. దివంగత ప్రజా గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చట్టపరమైన చిక్కులు మొదలయ్యాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో జూన్ 3న న్యాయవాదులు ఫణీంద్ర భార్గవ్, రవికుమార్ వోడి అరుపులు ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో గౌరవ సీఎం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొర్ర చందర్ లాల్ అనే వ్యక్తి పై కేసు (395/2026) నమోదు చేసి జైలుకు పంపించిన తెలంగాణ పోలీసులు. సోషల్ మీడియాలో మితిమీరినవ్యాఖ్యలు చేసేటప్పుడు ఇంగితజ్ఞానం మర్చిపోవద్దు. అలా చేస్తే చట్టం పని చట్టం చేస్తుంది. pic.twitter.com/8t5Z5ncftS
— Telangana Police (@TelanganaCOPs) June 6, 2026
పరువు నష్టం కలిగించేలా మాట్లాడారు: న్యాయవాదుల మండిపాటు
ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. దివంగత గద్దర్ స్వయంగా తన వద్దకు వచ్చి కారు కావాలని అడిగారని, తాను దాన్ని బహుమతిగా ఇచ్చానని ప్రసంగించారు. ఈ ప్రకటన పూర్తిగా "అబద్ధం, కల్పితం, పరువు నష్టం కలిగించేది" అని సదరు న్యాయవాదులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ కీలక నేత, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి కారు అడిగారనే వాదన దళిత సమాజం, ఉద్యమకారుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
లేని వ్యక్తిని వాడుకుంటున్నారంటూ నిరసనలు
గద్దర్ మన మధ్య లేరు కాబట్టి, ఆయన తనను తాను సమర్థించుకోలేరన్న బలహీనతను ఆసరాగా చేసుకొని పవన్ కళ్యాణ్ ఇటువంటి కట్టుకథలు అల్లుతున్నారని న్యాయవాదులు మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన గద్దర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడటంపై తెలంగాణవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డిపై పోస్టు పెట్టిన కార్యకర్త అరెస్ట్ కావడం, గద్దర్ వ్యాఖ్యలపై ఏకంగా అధినేత పవన్ కళ్యాణ్పైనే కేసు నమోదు కావడంతో జనసేన పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.














Click it and Unblock the Notifications