చార్జిషీట్ చూశాకే ధర్మాన రాజీనామాపై నిర్ణయం: బొత్స
చార్జిషీట్ చూసిన తర్వాత ధర్మాన విషయంలో ఏం చేయాలనేది నిర్ణయించుకుంటామని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో మంత్రి నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని, తెర వెనక వ్యవహారాలతో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు. మంత్రుల తప్పు లేదని తాను ఇప్పటికీ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. సిబిఐ చార్జిషీట్ను తాను ఇంకా చూడలేదని, మీడయాలో మాత్రమే ధర్మానను నిందితుడిగా చేర్చినట్లు చూశానని ఆయన అన్నారు. ఒక వేళ తప్పు ఉందని తేలితే శిక్ష తప్పదని ఆయన అన్నారు.
కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) కార్యాలయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించబోమని ఆయన అన్నారు. నేతలను లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తే సహించబోమని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిపై విమర్శలు చేసిన చిత్తరంజన్ దాస్ను వివరణ అడుగుతామని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, ధర్మాన వ్యవహారంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా స్పందించారు. రాజీనామా చేస్తానని నిన్ననే ధర్మాన ప్రసాద రావు తనకు చెప్పారని ఆయన అన్నారు. తొందరపాటు వద్దని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని సూచించానని ఆయన వివరించారు. అయితే సిబిఐ అంతటి సంస్థ తప్పు పట్టిన తర్వాత రాజనామా చేయడం తప్ప గత్యంతరం లేదని ధర్మాన అన్నట్లు ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజును ఈ నెల 16వ తేదీన ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.