నాలుగు రోజులే చూస్తాం, లేకుంటే ఉగ్రరూపమే: కెసిఆర్
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తెలంగాణవారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. పత్తి పంట తెలంగాణలో 90 శాతం పండితే ఆంధ్రలో కాటన్ రిసెర్చీ సెంటర్లు ఎక్కువ ఉండడమేమిటని ఆయన అడిగారు. ముఖ్యమంత్రి, గవర్నర్ వివక్ష ప్రదర్శిస్తున్నారని, ప్రాంతీయ వివక్షే లేకుంటే వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తెలంగాణవారిని విసిగా నియమించేవారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరును మారుస్తామని ఆయన చెప్పారు.
రాష్ట్రపతి ఉత్తర్వులను సీమాంధ్ర అధికారులు తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. సీమాంధ్రకు చెందిన వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు విత్తనాలను ప్రజలకు చేరవేయకుండా ప్రైవేట్ వ్యక్తులతో కుమ్ముక్కయి వారిని అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ సీడ్స్ను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణవాదులకు ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి కావాలని ఆయన అన్నారు.
విలీనం తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో నాశనమైందని ఆయన అన్నారు. తదుపరి వ్యవసాయ విశ్వవిద్యాలం విసి పదవిని తెలంగాణవారికే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దుకాణం నడపడానికి విశ్వవిద్యాలయాన్ని మూడు ముక్కలు చేశారని ఆయన విమర్శించారు. ఆ దఫా తెలంగాణ సాధించకపోతే సీమాంధ్రవాళ్లు బతకనీయరని ఆయన అన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఏది ఏమైనా తెలంగాణ సాధించాల్సిందేనని, అంతిమంగా విజయం తమదేనని ఆయన అన్నారు.