ధర్మాన రాజీనామా వద్దని సిఎం: పెద్దలపై ఒత్తిడి
సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ధర్మాన ప్రసాద రావు ఇంకా అక్కడే ఉన్నారు. మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి పల్లంరాజును కలిశారు. అధిష్టానానికి చెందిన ఇతర పెద్దలను కూడా కలిశారు. ఆయన మంగళవారం సాయంత్రం హైదరాబాదుకు వచ్చి మంత్రి పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ విషయాన్నే ధర్మాన ప్రసాదరావు తన సన్నిహితులతో చెప్పారు. కానీ, ఢిల్లీలో పెద్దలను కలవడానికి ఢిల్లీలో మరింత సమయం ఉండాల్సి వచ్చింది.
ధర్మాన ప్రసాదరావు చేత రాజీనామా చేయించకూడదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానం పెద్దలపై కూడా ఒత్తిడి పెడుతున్నట్లు సమాచారం. ఒకవేళ ధర్మాన రాజీనామా చేసినా ఆమోదించకూడదనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు చెబుతున్నారు. పెద్దలను కలవడంలో బిజీగా ఉన్నందున ధర్మాన రావాల్సిన విమానం అందలేదు. సాయంత్రం ఆరున్నర గంటలకు హైదరాబాదు వచ్చి, రాజీనామా చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
ధర్మాన ప్రసాదరావుపై అభియోగాలు మోపిన నేపథ్యంలో మరో మంత్రి గీతా రెడ్డి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రుల్లో గీతా రెడ్డి కూడా ఉన్నారు. దీంతో ఆమె లాబీయింగ్ కోసం ఢిల్లీ వెళ్లినట్లు చెబుతున్నారు.
ధర్మాన ప్రసాదరావును వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా సిబిఐ చేర్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులు గీతా రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, పొన్నాల లక్ష్మయ్య ఆందోళనకు గురవుతున్నారు.