టెక్కీలు సహా బెంగళూరు వీడుతున్న'ఈశాన్య' వాసులు
సుమారు ఐదు వేల మంది ఈశాన్య రాష్ట్రాల వాళ్లు బెంగళూరు, ఆ పరిసరాల నుండి తరలి వెళ్లారు/వెళుతున్నారు. ఇలా వెళుతున్న వారిలో విద్యార్థులు, ఐటి ఉద్యోగులు, ఇతర వృత్తుల వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాదాపు మూడు నుండి నాలుగు వేల మంది ఇప్పటికే బుధవారమే వెళ్లారని భావిస్తున్నారు. దాడులు చేస్తామని బాధితులకు పెద్ద ఎత్తున ఎస్సెమ్మెస్లు రావడంతో వారు వెళ్లి పోవడం ప్రారంభించారు.
ఇవన్నీ వదంతులేనని భయపడాల్సిన పని లేదని కర్నాటక హోమంత్రి, డిజిపి ప్రకటించారు. ఈ విషయమై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ముఖ్యమంత్రి షెట్టార్, కేంద్రహోంమంత్రి షిండేతో మాట్లాడారు. వారికి రక్షణపై హామీ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈశాన్య రాష్ట్రాల వారు వెళుతుండటంతో రైల్వే స్టేషన్లు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. అందుబాటులో ఉన్న రైళ్లలో వెళుతున్నారు. ఈ విషయమై షెట్టార్ పిటిఐతో మాట్లాడుతూ... ప్రధాని, హోంమంత్రి ఈశాన్య రాష్ట్రవాసులు ఎలాంటి భయాందోళనకు గురి కావొద్దని చెప్పారన్నారు.
వారికి ఎలాంటి అపాయం జరగదని, తమ ప్రభుత్వం వారికి రక్షణ కల్పిస్తుందని హామీ ఇచ్చారు. అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కూడా తనతో మాట్లాడారని, ఆయనకు తాను హామీ ఇచ్చానని చెప్పారు. కాగా ప్రయాణీకుల తాకిడి ఎక్కువ కావడం, వారి డిమాండ్ చేయడంతో రైల్వే అధికారుల ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమయ్యారు. ఈశాన్య రాష్ట్రాల వాసులు తరలి పోవడంపై ముఖ్యమంత్రి షెట్టార్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మరోవైపు ఈశాన్య రాష్ట్రాలవాసులలో పెరిగిన అభద్రతా భావంపై ఆ రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు గురువారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవాలని నిర్ణయించుకున్నారు. వివిధ రాష్ట్రాలలో ఉన్న ఈశాన్య రాష్ట్రాల వారి మనోభావాలను ఆమె దృష్టికి తేవాలని వారు నిర్ణయించుకున్నారు. వారికి భద్రత కల్పించాలని వారు ఆమెను కోరనున్నారు.