గుసగుస: చెవిలో చెప్పారు... సభ వాయిదా వేశారు
సరిగ్గా అదే సమయానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లా తన సీట్లోంచి లేచి, అధ్యక్ష స్థానంలో ఉన్న కురియన్ వద్దకు వెళ్లారు. ఆయన చెవిలో ఏదో గుసగుసలాడారు. అంతే.. ఒక్కసారిగా మళ్లీ ప్రతిపక్ష సభ్యులంతా తీవ్రంగా మండిపడ్డారు. శుక్లా రహస్యంగా చెప్పిన విషయాలు.. కురియన్ ముందున్న మైకులోంచి సభ మొత్తానికి వినిపించేశాయి. సభను ఈ రోజు మొత్తానికి వాయిదా వేసేయండని శుక్లా కురియన్ చెవిలో చెప్పారు. దీంతో, కురియన్ సభను బుధవారానికి వాయిదా వేశారు.
కాగ్ బయటపెట్టిన కోల్గేట్ కుంభకోణం పార్లమెంటును కుదిపేసింది. అక్రమాలు జరిగిన సమయంలో బొగ్గు శాఖను నిర్వహించిన ప్రధాని మన్మోహన్ సింగ్ వాటికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని పట్టుబట్టిన విపక్షాలు పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపజేశాయి. దీంతో లోక్సభ తొలుత మధ్యాహ్నం వరకు, తర్వాత బుధవారానికి వాయిదాపడింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా కాంగ్రెస్ నేత పీజే కురియన్ ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఇదే వివాదంతో వాయిదా పడింది.