ఢిల్లీలో కిరణ్ కుమార్ రెడ్డి బిజీ, రేపు సోనియాతో భేటీ
మంత్రులు చాలా వరకు ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదించకూడదనే ఉద్దేశంతో ఉన్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదిస్తే ప్రభుత్వం, పార్టీ కూడా ఆత్మరక్షణలో పడుతుందనేది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది. ధర్మాన రాజీనామాను ఆమోదించకూడదని మంత్రుల నుంచి ఒత్తిడి పెరగడంతో బంతిని కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం కోర్టులోకి నెట్టారు. ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదిస్తే వైయస్ మంత్రివర్గంలో పనిచేసిన ప్రస్తుత మంత్రులు ఏం చేస్తారనే ఆందోళన కూడా ముఖ్యమంత్రికి ఉన్నట్లు తెలుస్తోంది.
ధర్మాన వ్యవహారాన్ని విడిగా పరిష్కరించడం సాధ్యం కాదని కాంగ్రెసు అధిష్టానం కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో కిరణ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించినట్లు చెబుతున్నారు. గురువారం పలువురు అధిష్టానం నేతలను కలిసిన కిరణ్ కుమార్ రెడ్డి రేపు శుక్రవారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిసే అవకాశం ఉంది. పార్లమెంటు ఆవరణలోనే వారిని కిరణ్ కలుస్తారని అంటున్నారు.
ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే పుకార్లు దేశరాజధానిలో షికార్లు చేస్తున్నాయి. అయితే, ఆ పుకార్లను కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులు ఖండిస్తున్నారు. ముఖ్యమంత్రి మార్పు ఉండదని బుధవారంనాడు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా చెప్పారు. రాష్ట్ర మంత్రి తోట నరసింహం గురువారం అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన అన్నారు. తనను మార్చబోరనే దీమాతోనే కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే, అధిష్టానం కసరత్తు మాత్రం దండిగానే సాగుతోంది.
మంత్రివర్గ ప్రక్షాళనకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చాలా కాలంగా అడుగుతున్నారు. ఎన్నికలకు ముందు తనదైన జట్టును ఏర్పాటు చేసుకోవాలనేది ఆయన ఆలోచన. అందుకు ఇప్పటి వరకు అవకాశం లభించలేదు. ధర్మాన వ్యవహారాన్ని పరిష్కరించే క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డికి ఆ అవకాశం ఇస్తుందా అనేది చూడాల్సి ఉంది. అలాగే, తెలంగాణ అంశాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే, ఏమైనా జరగవచ్చుననే ఉత్కంఠ ఢిల్లీలో నెలకొని ఉంది. రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎంతటి కఠిన నిర్ణయాలకైనా అధిష్టానం రావచ్చునని అంటున్నారు. పిసిసి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే ఆలోచన కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు నోటీసులు ఎదుర్కుంటున్న మంత్రులను తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించే నెపంతో పిసిసి కార్యవర్గాన్ని వ్యవస్థీకరించి అందులో వారికి అవకాశం కల్పించవచ్చునని అంటున్నారు.
ఇదిలా వుంటే, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 8,9 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ సెప్టెంబర్ 8,9 తేదీల్లో తిరుపతి వచ్చి తిరుమలేశుడిని సందర్శించుకుంటారు. ప్రధాని మన్మోహన్ సింగ్ అదే తేదీల్లో శ్రీహరి కోటలో పర్యటిస్తారు.