చిత్తూరువారు సిఎం ఐతే.. కిరణ్ వేడుకోవాలి: మైసూరా
విద్యుత్ సమస్యను పరిష్కరించలేక పోతున్న ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతను ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ విస్మరించిందని, అది నిద్రపోతోందన్నారు. విద్యుత్ సంక్షోభం పరిష్కారంలో ప్రభుత్వం చేతకానితనంపై చర్చించడానికి తక్షణం శాసనసభ సమావేశాలు నిర్వహించాలన్నారు. అత్యంత ప్రధానమైన విద్యుత్ సమస్యపై వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాలని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా టిడిపి కోరాల్సి ఉందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన సంక్షోభానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కారణమన్నారు. కెజి బేసిన్లో రిలయన్స్ కావాలనే గ్యాస్ ఉత్పాదన తగ్గించిందని, భవిష్యత్తులో ధర పెంచి అమ్ముకోవడానికి ఇలా చేస్తున్నా, కేంద్రం ఏమీ చేయలేక చేతులెత్తేసిందన్నారు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్న చందంగా ఉందన్నారు. విద్యుత్ వంటి కీలక శాఖకు మంత్రిని నియమించక పోవడాన్ని మైసూరా తప్పు పట్టారు. కిరణ్ ఆయన వద్దనే ఈ శాఖను ఉంచుకున్నప్పటికీ ఒక్కసారి పూర్తిస్థాయిలో సమీక్షించలేదని ఆరోపించారు.
చిత్తూరు జిల్లా వాసులు చాలా మంచివారని, నాకు ఆ జిల్లాలో మంచి మిత్రులున్నారని, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కూడా అదే జిల్లాలో ఉన్నారని, అదేమిటో గాని చిత్తూరు జిల్లా వాసి సిఎం పదవిలో ఉంటే వర్షాలు కురవవని, వర్షాలు కురిపించాలని వారు ఆ స్వామివారిని మొక్కుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు.