సీమవాసుల్ని రౌడీలుగా చిత్రీకరించారు: బైరెడ్డి ఉద్వేగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీమకు చాలా అన్యాయం జరిగిందన్నారు. సీమ ప్రజలకు త్యాగాలు మాత్రమే తెలుసన్నారు. తమకు తిండి లేకున్నా, డబ్బులు లేకున్నా మరేం లేకున్నా ఇనుప పెట్టే నిండా పౌరుషముందని, కష్టపడి పని చేసే గుణముందన్నారు. రాయలసీమవాసులను ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో తినడానికి లేకున్నా పదిమందికి అన్నం పెట్టే గుణం సీమవాసులది అని, దానవీరశూరకర్ణ వారసత్వంలో ఉన్నామన్నారు.
ఇన్నాళ్లూ నేతల మాటలు నమ్మి మోసపోయామని, ఇప్పటికైనా ప్రభుత్వం సీమలోని ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, అనంతపురంలో సైన్స్ సిటీ ఏర్పాటు చేయాలని, మదనపల్లిలో ఐటి పార్కు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీమలో ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీటిని అందించాలన్నారు. మౌలిక వసతులు పెంచాలన్నారు. ప్రొద్దుటూరు, హిందూపురం, గుంతకల్లు, నంద్యాల, తిరుపతిలను జిల్లాలుగా మార్చాలన్నారు. సీమ కోసం ప్రత్యేక రాయలసీమ సైనిక రెజిమెంట్ ఏర్పాటు చేయాలన్నారు.
రాయలసీమ అంటే త్యాగానికి మారు పేరు అని, అందుకే అప్పుడు కర్నూలు జిల్లా రాజధానిని హైదరాబాదుకు మార్చేందుకు అంగీకరించామన్నారు. మా ఆత్మగౌరవం జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీమవాసులను రౌడీలుగా చిత్రీకరించిన వారందరికీ బుద్ధి చెప్పాలన్నారు. ఇతర ప్రాంతాలకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తూ సీమ అభివృద్ధిని విస్మరిస్తున్నాయని విమర్శించారు. హైదరాబాదులో సమావేశం ఏర్పాటు చేయవద్దని తనను బెదిరించాలని, కానీ మా జోలికొస్తే ఊరుకునేది లేదని సవాల్ చేసి తాను ఈ సభను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
సీమకు అన్ని రంగాలలో అన్యాయం జరిగిందన్నారు. సీమను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. ఇన్నాళ్లూ ఇతర ప్రాంతాల నేతలు చెప్పిన కట్టు కథలు విన్నామని, ఇక వినే ప్రసక్తి లేదన్నారు. ఇతరుల చేతుల్లో మోసపోవడానికి, వారి చేతుల్లో బతకడానికి తాము సిద్ధంగా లేమన్నారు. సీమ కోసం త్యాగాలు చేస్తామని, అవసరమైతే ప్రాణాలు అర్పిస్తామన్నారు. సీమ కోసం ప్రతి ఒక్కరూ ఓ ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి కావాలని పిలుపునిచ్చారు. సీమ కోసం తాను త్వరలో పాదయాత్ర చేపడతానని చెప్పారు.