సోనియాగాంధీని చూస్తే వణుకు: టి-ఎంపీలపై నారాయణ
శ్మశానంలా ఉన్న తెలంగాణను కాకుండా సంపదతో ఉన్న ప్రత్యేక రాష్ట్రం కోసం తాము పోరాడుతున్నామన్నారు. పండుగల పేరిట తెలంగాణ ప్రక్రియను వాయిదా వేస్తున్న కాంగ్రెస్ను భోగి మంటల్లో వేసి తగులబెడితేనే ప్రత్యేక రాష్ట్రం వస్తుందన్నారు. తెలంగాణకు పచ్చి వ్యతిరేకి అయిన ప్రణబ్ముఖర్జీ రాష్ట్రపతి కావడం దేశానికి దౌర్భాగ్యమన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు ఆత్మహత్య చేసుకోరాదని, ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న నేతలే చేసుకునేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
అలాగే ఏదో ఒక వివాదం రెచ్చగొట్టే విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఓ దోపిడీదారని ధ్వజమెత్తారు. పార్టీల నాన్పుడు ధోరణి వల్ల ప్రాంతీయ విద్వేషాలు పెరుగుతున్నాయన్నారు. తెరాసతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత తన వైఖరి మార్చుకున్నాడని విమర్శించారు. ప్రజలు విద్యుత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నాడని విమర్శించారు.
నేతి బీర కాయలో నెయ్యి ఎంత ఉంటుందో ధర్మాన పేరులో ధర్మం కూడా అంతేనని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్పై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికను బహిర్గతం చేయాలని నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సబ్ప్లాన్ నిధుల వ్యయంపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఖమ్మంలో సూచించారు.