తెలంగాణ: కావూరి ఇంట్లో సీమాంధ్ర విందు భేటీ

ఈ సమావేశంలో కావూరితో పాటు కెవిపి రామచంద్ర రావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బొత్స ఝాన్సీ, కిల్లి కృపారాణి, సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, వనబాక లక్ష్మి, జెడి శీలం పాల్గొన్నారు. రాత్రి ఎనిమిదిన్న గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సుదీర్ఘంగా సాగింది. సమైక్యగళం వినిపించాలని వారు నిర్ణయించుకున్నారు.
తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్న సమయంలో సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను బలంగా తెలపాలని ఎంపీలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమను విశ్వాసంలోకి తీసుకోవాలని నివేదించనున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు పెద్దలందరినీ కలవాలని, తొలుత హోం మంత్రి సుశీల్కుమార్ షిండే, పార్టీ ఇన్చార్జి గులాంనబీ ఆజాద్, పరిశీలకుడు వయలార్ రవి, కోర్ కమిటీ సభ్యులు చిదంబరం, ఆంటోనీల అపాయింట్మెంట్లు కోరాలని నిర్ణయించారు.
అందరినీ కలిసిన తర్వాత సోనియాతోనూ భేటీ కావాలని తీర్మానించారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని, తాత్కాలిక పార్టీ ప్రయోజనాలు, ఒత్తిళ్లను పరిగణలోకి తీసుకోవద్దని విన్నవించనున్నారు. సమావేశం అనంతరం రాష్ట్ర విభజనపై తమ పార్టీ అధిష్ఠానం త్వరలో నిర్ణయం తీసుకోనుందని వస్తున్న వార్తల నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం, కర్నూలు వరకూ అన్ని జిల్లాల ఎంపీలంతా భేటీ అయ్యామని కావూరి సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
రాష్ట్ర విభజన సమస్యపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని, జాప్యం చేస్తే ప్రజల మధ్య శత్రుభావం ఏర్పడే ప్రమాదం ఉందని అధిష్ఠానానికి చెబుతామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి సమైక్య రాష్ట్రంలోనే జరుగుతుందని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై చేస్తున్న ఏ ప్రతిపాదనను తాము అంగీకరించబోమన్నారు. పరకాల ఎన్నికల్లో 33 శాతం తెలంగాణకు మద్దతిస్తే, 67 శాతం తెలంగాణకు వ్యతిరేకంగా ఓటేశారని కావూరి చెప్పారు.












Click it and Unblock the Notifications