జగన్ పార్టీకి లెఫ్ట్ వినతి: చంద్రబాబు మద్దతుకు భేటీ
అదే సమయంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు బుధవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ప్రభుత్వ వైఖరికి నిరననగా తాము సెప్టెంబర్ మొదటివారంలో చేయ తలపెట్టిన బంద్కు మద్దతు ఇవ్వాలని వారు చంద్రబాబును కోరారు. సమస్యలపై విడివిడిగా పోరాడే కన్నా ఉమ్మడిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని వారు చంద్రబాబుతో చెప్పారు.
వారి సూచనపై సానుకూలంగా ప్రతిస్పందించిన చంద్రబాబు తమ పార్టీ నాయకులతో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. చంద్రబాబు స్పందనపై వామపక్షాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. తమ ఉద్యమానికి కాంగ్రెసు మినహా అన్ని పార్టీల మద్దతు కోరుతున్నట్లు వారు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, ప్రణాళికా లోపం వల్లనే విద్యుత్తు సమస్య ఏర్పడిందని వారు విమర్శించారు.
విద్యుత్తు సమస్యపై తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఉద్యమం చేపట్టింది. తెలుగుదేశం పార్టీ నాయకులు గత రెండు రోజులు ప్రభుత్వంపై పోరాడుతున్నారు. బుధవారం ఇందిరా పార్కు వద్ద ధర్నాకు దిగి సచివాలయ ముట్టడికి ప్రయత్నించారు. అంతకు ముందు ఓ రోజు శానససభ ఆవరణలో, మరో రోజు సచివాలయంలో వారు ఆందోళనలు చేశారు.
తెలుగుదేశం తీరుపై కాంగ్రెసు నాయకులు మండిపడుతున్నారు. అధికార దాహంతోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీల వర్షం కురిపిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి విమర్శించారు. విద్యుత్తు ఉత్పాదన కోసం జలాశయాల్లో నీళ్లు లేవని, గ్యాస్ కొరత ఉందని ఆయన చెప్పారు. అదనపు గ్యాస్ కావాలని కేంద్రాన్ని కోరుతున్నామని ఆయన చెప్పారు. విద్యుత్తుపై మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని ఆయన విమర్సించారు. సచివాలయంలోనూ శాసనసభ ఆవరణలోనూ తెలుగుదేశం వ్యవహరించిన తీరు వల్ల సమస్య పరిష్కారం కాదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.