కిరణ్కు డెడ్లైన్: టిడిపి నేతల అరెస్టు, వైఎస్పై దేవినేని
ఇందులో భాగంగా హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద ఆ పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, తలసాని శ్రీనివాస యాదవ్, అశోక్ గజపతి రాజు, మోత్కుపల్లి నర్సింహులు తదితర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతులకు ఏడు గంటల విద్యుత్తో పాటు కోతలు ఎత్తివేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. అఖిలపక్ష సమావేశాన్ని వెంటనే ముఖ్యమత్రి ఏర్పాటు చేయాలన్నారు.
ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలలోగా దీనిపై హామీ ఇవ్వాలని లేదంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ ఏమైనా కాంగ్రెసు పార్టీ అబ్బసొత్తా... అక్కడ ధర్నా చేస్తే ఏమవుతుందని వారు ప్రశ్నించారు. ఇందిరమ్మ బాటకు వెళ్లి ఆటలాడుతున్న అసమర్థ కిరణ్ కుమార్ రెడ్డిని ఎక్కడికక్కడ విద్యుత్ కోసం నిలదీయాలని పిలుపునిచ్చారు.
కాగా రెండు గంటల వరకు కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో టిడిపి నేతలు సచివాలయ ముట్టడికి బయలుదేరారు. వారి ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీసు స్టేషన్కు తరలించారు.
జలయజ్ఞం పేరిట పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీలో అక్రమాలకు పాల్పడి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కృష్ణా డెల్టాకు అన్యాయం చేశారని దేవినేని ఉమామహేశ్వర రావు కృష్ణా జిల్లాలో అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు పేరుతో కృష్ణా డెల్టా నీటిని వైయస్ పులివెందులకు తరలించి స్వప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపించారు. డెల్టా రక్షణ విషయంలో ప్రభుత్వం తరఫున ఇంతవరకు కౌంటర్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.