సినిమాల్లో నటించాలనుకున్న కసబ్! దొంగ టు ఉగ్రవాది

తనకు ముంబయి దాడులతో ఎలాంటి సంబంధం లేదని, తనకు ఎకె 47 అంటే ఏమిటో తెలియదని, కేవలం బాలీవుడ్ సినిమాలలో నటించేందుకే తాను భారత్ వచ్చానని జడ్జి ముందు పలికాడు. విచారణ అనంతరం కోర్టు అతడిని నేరస్తుడిగా పరిగణిస్తూ ఉరిశిక్ష ఖరారు చేసింది. జైలులో కూడా కసబ్ విచిత్రంగా ప్రవర్తించాడు. తాను ఏ తప్పు చేయలేదని, తనకు ముంబయి ఘటనతో సంబంధం లేదని తొలుత చెప్పిన కసబ్ ఆ తర్వాత తప్పును అంగీకరించాడు.
జైలులో ఉంటూ బిర్యానీ కావాలని డిమాండ్ చేశాడు. నన్ను ప్రేరేపించిన వారిని పట్టుకోవాలని, తనకు ఉరిశిక్ష వేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదన్నాడు. భారతదేశ చట్టాలు తనను ఏమీ చేయలేవని, అంతర్జాతీయ కోర్టులో విచారించాలని, ఇక్కడి న్యాయస్థానాలలో న్యాయం జరగదని వ్యాఖ్యానించాడు. పలు సందర్భాలలో జడ్జిల ముందు మాటలు మార్చుతూ వచ్చాడు. మారణ హోమానికి తాను కారణమని చెప్పిన కసబ్ ఆ తర్వాత మేమే చేశామని చెబుతూ.. తన వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని, సహచరుచు ఇస్మాయిల్ ముంబయి మారణకాండకు ప్లాన్ చేశాడని చెప్పుకొచ్చాడు.
ఉరిశిక్ష పడ్డాక కొద్ది రోజులకు తనకు చావాలని లేదని, ఆ తర్వాత తనను చంపేయాలని లేదంటే పాక్లోని తన కుటుంబానికి ప్రమాదమని చెప్పేవాడు. ముంబయి దాడిని సమర్థించుకున్నాడు. తన పోలికలు ఉన్న ఉగ్రవాదిని చంపేశాకే తనను అరెస్టు చేశారని చెప్పాడు. కాగా కసబ్ జైలులో ఉన్న ఈ నాలుగేళ్లు అతని భద్రత కోసం ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది.
ఈ కేసులో 658 మంది వాంగ్మూలమిచ్చారు. 30 మంది సాక్ష్యులు కసబ్ను గుర్తించారు. పదేళ్ల బాలిక కసబ్ పైన ఫిర్యాదు చేసింది. ముంబయి దాడులకు బీజం పాక్ లోనే అని సుప్రీం కూడా గుర్తించింది. ప్రత్యేక కోర్టులో ఇద్దరు ఎన్ఎస్జి కమెండోలు సాక్ష్యమిచ్చారు. సాంకేతిక ఆధారాలను చూపించేందుకు అమెరికా ఎప్బిఐ సహకరించింది.
కాగా కసబ్ తన చిన్న నాడే పేదరికం కారణంగా చదువును మధ్యలోనే ఆపేశాడు. 2005లో తండ్రితో గొడవపడి ఇళ్లు వదిలి వచ్చేశాడు. బతుకుదెరువు కోసం చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత దారి దోపిడీలకు తెగించాడు. దొంగతనాల కోసం ఆయుధాలు వాడేవాడు. ఓసారి ఆయుధాల కొనుగోలు సమయంలో లష్కరే తోయిబాతో పరిచయమయింది.
ఆ సంస్థ వైపు ఆకర్షించబడ్డాడు. లష్కరే తోయిబా మార్గాంలో వెళితే పాక్ సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని భావించిన కసబ్ అటు వైపు వెళ్లాడు. దాడుల కోసం వారి వద్ద అత్యుత్తమ శిక్షణ తీసుకున్నాడు. కసబ్ చలాకీతనాన్ని గుర్తించిన లష్కరే తోయిబా అతనికి మంచి శిక్షణను ఇచ్చింది. ఆ తర్వాత భారత్పై దాడికి పురికొల్పింది. దాడిలో ప్రాణాలు కోల్పోతే తన కుటుంబానికి భారీ ఆర్థిక సహాయం చేస్తామని లష్కరే తోయిబా చెప్పడం కూడా కసబ్కు నచ్చింది.












Click it and Unblock the Notifications