సుష్మాతో సోనియా గాంధీ భేటీ: దిగిరాని బిజెపి
ప్రధాని రాజీనామా చేసే వరకు పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తామని బిజెపి సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు చెన్నైలో చెప్పారు. వెనక్కి తగ్గేది లేదని, పార్లమెంటు లోపల, బయట తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని బిజెపి అధికార ప్రతినిధి షహనవాజ్ హుస్సేన్ చెప్పారు.
ఆ తర్వాత సోనియా గాంధీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను కలిశారు. యుపిఎ భాగస్వామ్య పక్షాలతో సమావేశం కావాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఉన్నారు. కోల్ బ్లాక్లను రద్దు చేయబోమని కాంగ్రెసు పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రధాని రాజీనామా డిమాండ్ను కూడా తిరస్కరించింది.
యుపిఎకు వెలుపలి నుంచి మద్దతు ఇస్తున్న సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ కోల్ బ్లాక్ కేటాయింపుల కుంభకోణంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యుపిఎ ప్రభుత్వం దేశానికి భారంగా మారిందని వెంకయ్య నాయుడు విమర్శించారు. బొగ్గు కుంభకోణమే కాదు, యుపిఎలో ప్రభుత్వం వరుస కుంభకోణాల్లో చిక్కుకుందని ఆయన అన్నారు. కాగ్ను ప్రధాని, కాంగ్రెసు నాయకులు విమర్శించడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు.